నంగునూరులో చరిత్ర ఆనవాళ్లు
ABN, First Publish Date - 2021-05-23T05:12:04+05:30
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకేంద్రంలో జైనుల కాలంనాటి ఆలయాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు హనుమాన్ ఆలయంలోని నంది ముఖపట్టంమీద నాలుగురేకలపూలు అలంకరించబడి ఉన్నాయి.
నంగునూరు, మే 22: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకేంద్రంలో జైనుల కాలంనాటి ఆలయాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు హనుమాన్ ఆలయంలోని నంది ముఖపట్టంమీద నాలుగురేకలపూలు అలంకరించబడి ఉన్నాయి. పొట్టికొమ్ములు మూపురం, మూపున దర్భముడితో వేసిన గజ్జెలపట్టెడ, మెడ ముందుకు, మూపు వెనుకకు, మధ్యలో కుచ్చులు రెండువైపులా ఉన్నాయి. రాష్ట్రకూట చక్రవర్తులకాలంలో అంచుల సోపానాలతో చెక్కిన లింగపీఠం సోమసూత్రంవైపు రెండు కోణాకృతులు, మధ్యలో సన్నని చిన్న శివలింగం ప్రతీష్ఠించబడి ఉన్నది. శివలింగం వెనక హనుమంతుడి విగ్రహం ఉంది. ఈ ఆలయంలోనే చతుర్భుజుడైన గణపతి విగ్రహం ఉన్నది. లలితాసనంలో కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న గణపతి విగ్రహాలు ఈప్రాంతంలో అనేకచోట్ల గుర్తించివచ్చు. ఈ విగ్రహాలన్నీ ఒకే శైలిలో కనిపిస్తున్నాయి. ఇదే ఆలయంలో శతాబ్ధాల కాలంనాటి దుర్గాదేవి విగ్రహం కనిపిస్తుంది. త్రిశూల, ఢమరుకాలు, అభయహస్తం, పద్మం ధరించి సుఖాసనంలో, కరండమకుటంతో, హార,గైవ్రేయకాలతో, వెనక త్రిభుజశీర్ష తోరణంతో దుర్గాదేవి విగ్రహం కనిపిస్తున్నది.
నంగునూరులోని మరో రామాలయంలో గోడలపై చేతులుపట్టుకుని నిల్చున్న మిథునం (స్త్రీ,పురుషుల జంట) చెక్కిఉన్నది. గుడి గోడలకు రాష్ట్రకూటుల కాలంనాటి స్తంభాలను ఉపయోగించారు. ఆలయం గోడలకు జైనతీర్థంకరుడిని పోలిన కాయోత్సర్గ భంగిమలో నిలబడివున్న పురుషుడి బొమ్మలు చెక్కిఉన్నాయి. నంగునూరులోని జైనక్షేత్రం బాహ్యకుడ్యంపై ఇటువంటి శిల్పమే కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారబంధంపై శంకుచక్రాల నడుమ తిరునామ పీఠం లలాటబింబంగా చెక్కబడి ఉన్నది. ఇటువంటి తిరుపీఠం రత్నాపూర్ రాతిచిత్రాలపై అధ్యారోపనంగా చెక్కిన శిల్పాలను పోలిఉన్నది.
Updated Date - 2021-05-23T05:12:04+05:30 IST