సిద్దిపేటలో 50 డివిజన్లకు కసరత్తు
ABN, First Publish Date - 2021-01-16T06:13:41+05:30
సిద్దిపేట పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త వార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం, అధికారులు యోచిస్తున్నారు.
ప్రస్తుతం 34.. త్వరలోనే పునర్వివిభజన
సిద్దిపేట సిటీ, జనవరి 15: సిద్దిపేట పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త వార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం, అధికారులు యోచిస్తున్నారు. మెదక్ రోడ్డులో బుర్గుపల్లి వరకు, హైదారాబాద్ రోడ్డులో దుద్దెడ వరకు, కరీంనగర్ రోడ్డులో మందపల్లి వరకు, వేములవాడ రోడ్డులో రామంచ వరకు, ముస్తాబాద్ రోడ్డులో పూల్లురు వరకు, తోగుట రోడ్డులో ఎన్సాన్పల్లి వరకు పట్టణం విస్తరించింది. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో వార్డులను పెంచేందుకు మంత్రి హరీశ్రావు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర నగరాల్లో ప్రస్తుతం 50 డివిజన్లు ఉన్నాయి. సిద్దిపేటలో కూడా అదే తరహాలో 50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉండగా.. రానున్న ఎన్నికల్లో వార్డులను పెంచనున్నారు. వార్డుల సంఖ్య పెరిగితే అభివృద్ధి కూడా పరుగులు పెడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో 1952లో ఐదుగురు సభ్యులతో ఆ కాలంలో అభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం 1956లో పట్టణంలో 12 వార్డులను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించారు. దినదినాభివృద్ధి చెందుతుండడంతో 1980లో 20 వార్డులకు పెంచారు. 1995లో 28 వార్డులకు, 2005లో 34 వార్డులకు పెంచారు. పట్టణంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండడంతో దిదినాభివృద్ధి చెందుతున్నది.
Updated Date - 2021-01-16T06:13:41+05:30 IST