ప్రకృతి ప్రేమికుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ABN, First Publish Date - 2021-10-29T05:33:30+05:30
అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కానీ ప్రవృత్తి మొక్కల ప్రేమికుడు. దీంతో ఆయన తన ఇంటిని మొక్కలతో నింపి ప్రకృతి వనంగా తీర్చిదిద్దాడు.
టెర్రస్పై 250 మొక్కల పెంపకం
నారాయణపేట రూరల్, అక్టోబరు 28 : అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కానీ ప్రవృత్తి మొక్కల ప్రేమికుడు. దీంతో ఆయన తన ఇంటిని మొక్కలతో నింపి ప్రకృతి వనంగా తీర్చిదిద్దాడు. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎస్.విశ్వనాథ్ దామరగిద్ద మండలం కాన్కుర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తన ఇంటి టెర్రస్పై ఏకంగా 250పై చిలుకు మొక్కలను పెంచి ఇంటిని మొత్తం ప్రకృతి వనంగా తీర్చిదిద్దారు. టెర్రస్పై పూల మొక్కలైన పారిజాతం, నందివర్ధనం, నోవర్ధనం, గన్నేరు, దేవగన్నేరు, చేమంతి, బంతి, జర్మన్బంతి, నిత్యమల్లెలు, గులాబీలు, హజారీ మోగ్ర, లిల్లీ, సత్యనారాయణ, గోరింటతో పాటు పండ్ల మొక్కలైన దానిమ్మ, జామ, అరటి, కూరగాయలు బెండ, వంకాయ, మిరప, టమాట, బూడిద గుమ్మడిలు, తులసి, కలబంద, రాణఫల, దగ్గు ఆకు, బ్రహ్మకమలం, తమలపాకు, మనీప్లాంట్ తదితర మొక్కలను పెంచుతున్నాడు. వీటికి కేవలం సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ ఎరువులను వాడుతూ ప్రతి నిత్యం వాటిని సంరక్షిస్తుంటాడు. దాదాపు ఆరేళ్లుగా ఇంటి ఆవరణలో ఇలా మొక్కలను పెంచుతూ తనకున్న ప్రకృతి ప్రేమను చాటుతున్నాడు. తన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో తన భార్య శ్రీవిద్య సహకారంతో దాదాపు మూడు గంటల పాటు మొక్కల సంరక్షణకు సమయం కేటాయిస్తున్నాడు.
Updated Date - 2021-10-29T05:33:30+05:30 IST