జనరల్ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం
ABN, First Publish Date - 2021-06-19T06:18:08+05:30
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఏ ఒక్కరు కూడా వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లకుండా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
200 పడకల ఆక్సిజన్ లైన్ వార్డు ప్రారంభంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్(వైద్యవిభాగం), జూన్ 18: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఏ ఒక్కరు కూడా వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లకుండా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 200 పడకల ఆక్సిజన్ లైన్ వార్డును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జనరల్ ఆస్పత్రిలో ఇదివరకే 300 పడకలకు ఆక్సీజన్, వెంటిలేటర్, ఐసీయూ సౌకర్యం కల్పించామన్నారు. తాజాగా మరో 200 పడకలతో ఆక్సీజన్ లైన్తో కూడిన వార్డును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కరోనా రెండో దశలో హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేకుండా అన్ని రకాల వైద్యసేవలు ఆస్పత్రిలోనే కల్పించామని వెల్లడించారు. దీంతో పాటు ఆస్పత్రి ఆవరణలో అధునాతనమైన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని కూడా ఇటీవల ప్రారంభించామన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఆస్పత్రులను అధ్యయనం చేసి అదే తరహాలో మహబూబ్నగర్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.జీవన్, డా.నర్సింహరావు పాల్గొన్నారు.
స్కానింగ్ కోసం బయటకు పంపిస్తే చర్యలు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్ పడకలను ప్రారంభించిన అనంతరం మంత్రి పలువురు రోగులతో మాట్లాడారు. స్కానింగ్కు బయటకు పంపిస్తున్నారని రోగులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కూడిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, అయి నప్పటికీ డాక్టర్లు స్కానింగ్లకు ప్రైవేటుకు వెళ్లమ నడం సరైంది కాదని చెప్పారు. అలా చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రి ల్యాబ్ ఇన్చార్జిలను పిలిపించి మాట్లాడారు. రేడియాలజిస్టు ఒక్కరే ఉన్నందున 4, 5 నెలల్లో నిర్వహించే టీఫా స్కానింగ్కు మాత్రమే బయటకు పంపిస్తున్నామని తెలిపారు. అన్ని పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించొద్దని మంత్రి ఆదేశించారు.
Updated Date - 2021-06-19T06:18:08+05:30 IST