గురుకులానికి దారేది?
ABN, First Publish Date - 2021-10-22T05:16:14+05:30
అధికారుల అనాలోచిత అస్తవ్యస్త విధానాలు గిరిజన విద్యార్థుల పాలిట శాపంగా మారాయి.
రోడ్డు మార్గంలేని ప్రదేశంలో నిర్మాణం
అధ్వానంగా రహదారి
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
గురుకులాలు ప్రారంభమవడంతో విద్యార్థుల అవస్థలు
వైరా, అక్టోబరు 21: అధికారుల అనాలోచిత అస్తవ్యస్త విధానాలు గిరిజన విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటుచేయాల్సిన గురుకులాలను ఎక్కడో మారుమూలన అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కోట్లరూపాయలతో నిర్మించినప్పటికీ ఫలితాలు రావడం లేదు. అందుకు వైరా నియోజకవర్గస్థాయిలో మండలంలోని కొత్తముసలిమడుగు సమీపంలో నిర్మించిన ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలే ప్రత్యక్ష నిదర్శనం. ఈ గురుకుల పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కరువైంది. రైతులు పొలాలకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్న రోడ్డే ఈ గురుకులానికి దిక్కు. చాలా ఇరుకుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు వెళ్లిరావాలన్నా, గురుకులంలోని విద్యార్థులకు అవసరమైన నిత్యావసరాలు తీసుకువెళ్లే వాహనాలు వెళ్లాలన్నా కనీస రహదారి సౌకర్యం లేదు. అలాంటి ఈ గురుకులంలో తొలిసారి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వైరా నియోజకవర్గానికి ఆరేళ్ల కిందట ఈ గురుకులం మంజూరైంది. ఇప్పటివరకు ప్రతినెలా వేలాదిరూపాయల అద్దె చెల్లిస్తూ కొణిజర్ల సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల భవనాల్లో నిర్వహించారు. 2016 సెప్టెంబరులో మంజూరైన ఈ గురుకులానికి నియోజకవర్గ కేంద్రంలో కానీ, కనీస సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో కానీ స్థలం లేకపోవడంతో మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రూ.4.20కోట్ల వ్యయంతో గురుకుల భవనాన్ని నిర్మించారు. దాదాపు వెయ్యిమంది విద్యార్థుల వసతి కోసం గ్రౌండ్ఫ్లోర్ నుంచి నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఐదు నుంచి పదోతరగతి వరకు పాఠశాల అలాగే ఇంటర్మీడియేట్ బైపీసీ, ఎంపీసీతో జూనియర్ కళాశాల తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొణిజర్ల మండలంలోని ప్రైవేట్ భవనాల్లో ఉన్న గురుకులానికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని వేసవికాలంలోనే ఇక్కడకు చేర్చారు. హైకోర్టు ఆదేశాలతో తొలిసారి తరగతులు ప్రారంభించేందుకు యాజమాన్యం సిద్ధమవుతుంది. ప్రస్తుతం పాఠశాల, జూనియర్ కళాశాలగా ఉన్న ఈ గురుకులంలో ఆతర్వాత డిగ్రీ కళాశాలను నిర్వహించే విధంగా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 640మంది విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు.
రహదారి ఏదీ..
ఈ గురుకులానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెళ్లాలంటే మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డులో ఉన్న తాటిపూడి నుంచి దాదాపు మూడుకిలోమీటర్లు పొలాల మధ్య గుంతలతో ఉన్న రోడ్డే దిక్కుగా ఉంది. ఒకవేళ తల్లాడ రోడ్డులోని జాతీయ ప్రధాన రహదారి నుంచి గండగలపాడు, లక్ష్మీపురం మీదుగా ముసలిమడుగు నుంచి రెండుకిలోమీటర్లు మట్టి రోడ్డుపై వెళ్లాల్సి ఉంది. ఈ రహదారి అత్యంత అధ్వానంగా ఉంది. పేరుకే ఆర్అండ్బీ రోడ్డు అయినప్పటికీ డొంక రోడ్ల కంటే అత్యంత అధ్వానంగా ఉంది. అలాంటి రహదారి లేని ప్రదేశంలో ఈ గురుకులాన్ని నిర్మించారు. ఈ గురుకులానికి రహదారి సౌకర్యం కల్పించాలని యాజమాన్యం ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. ఆర్టీసీ బస్సులు నడపాలని కొంతమంది తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు గురువారం ఈ రోడ్డును పరిశీలించి బస్సులు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గురుకుల భవనం చుట్టూ కాంపౌండ్వాల్ నిర్మించాల్సి ఉంది. గేట్ను ఏర్పాటుచేయాలి. భవనం ముందుభాగం మొత్తాన్ని చదును చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది.
ప్రతిపాదనలకే పరిమితం
ఈ ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి గానూ రూ.15కోట్ల నిధులు కోరుతూ ఏఈఈ భగవాన్నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తాటిపూడి నుంచి ముసలిమడుగు మీదుగా కొండకొడిమ వరకు 8కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు కోరుతూ ఇప్పటికీ పలు దఫాలు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది.
రహదారిని అభివృద్ధి చేయాలి
ఈ గురుకులానికి వెళ్లి రావడానికిగానూ వెంటనే రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉందని వైరా ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఏమాత్రం అలసత్వం లేకుండా ఈ రోడ్డును నిర్మించాలని కోరారు.
Updated Date - 2021-10-22T05:16:14+05:30 IST