సర్కారు భూమి.. అయితే ఏమీ?
ABN, First Publish Date - 2021-10-30T05:07:55+05:30
చండ్రుగొండ రెవెన్యూ పరిధిలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతోంది. ఈక్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం సమీపలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో గురువారం రాత్రికి రాత్రే ఎక్స్కవేటర్ సహాయంతో ఆక్రమార్కులు మామిడి మొక్కలు నాటారు.
చండ్రుగొండలో రెచ్చిపోయిన కబ్జాదారులు
తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రెండెకరాల్లో పాగా
రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటిన వైనం
కొందరి ఫిర్యాదుతో తహసీల్దార్ ఉషాశారద చర్యలు
సిబ్బందితో నాటిన మొక్కల తొలగింపు
చండ్రుగొండ, అక్టోబర్ 29: చండ్రుగొండ రెవెన్యూ పరిధిలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతోంది. ఈక్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం సమీపలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో గురువారం రాత్రికి రాత్రే ఎక్స్కవేటర్ సహాయంతో ఆక్రమార్కులు మామిడి మొక్కలు నాటారు. ఈ ఘటనపై చర్యతీసుకోవాలని తహశీల్దార్ ఉషాశారదకు కొందరు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని స్వాధినం చేసుకోవాలని సిబ్బందిని తహసీల్దార్ ఆదేశించారు. సిబ్బంది నాటిన మామిడి మొక్కలను తొలగించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
గత రెవెన్యూ అధికారుల అండతో
ఒక పక్క జాతీయ రహదారి.. మరో వైపు పలు ప్రభుత్వ కార్యాలయాలు.. వీటి చుట్టూ కోట్లరూపాయల విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ఇప్పుడు కొందరి ఆక్రమణదారుల చేతిలో ఉంది. గత రెవెన్యూ అధికారుల అండదండతోనే ఆక్రమణలు, క్రయవిక్రయాలు యథేచ్ఛగా జరిగాయి. జాతీయ రహదారి పక్కన గుంట స్థలం రూ ఏడు నుంచి పది లక్షల వరకు పలుకుతోంది. కార్యాలయాలున్న ప్రాంతంలో గుంట భూమిని రూ. లక్ష నుంచి రెండు లక్షలకు కబ్జాదారులు విక్రయాలు జరుపుతున్నారు. అదే సాగు భూమి అయితే ఎకరం రూ. లక్షల్లో విక్రయిస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల వచ్చిన రెవెన్యూ అధికారులు సర్కారు భూముల రక్షణకోసం ప్రయత్నిస్తున్నా రాజకీయ నాయకుల బలం ముందు సరిపోవడం లేదు. దాదాపు పన్నెండుఉ వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుండటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-10-30T05:07:55+05:30 IST