సిద్ధం.. సందిగ్ధం ! వార్షిక పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళం
ABN, First Publish Date - 2021-04-11T05:41:26+05:30
సిద్ధం.. సందిగ్ధం ! వార్షిక పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళం
నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో భిన్నవాదనలు
గత ఏడాది పరిస్థితులే ఉత్పన్నమవుతాయని ప్రచారం
కసరత్తును అశ్రద్ధ చేస్తున్న విద్యార్థులు
పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలో తల్లిదండ్రులు
ఖమ్మం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. వైరస్ వ్యాప్తితో గత సంవత్సరమే కొన్ని పరీక్షలు రద్దు చేయగా ప్రస్తుతం సెకండ్వేవ్ ఉధృతంగా ఉండడంతో ఈ సంవత్సరం పరీక్షలు ఉంటాయా లేదా అనేదానిపై విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసిన ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులకు అనుమతించగా మరోపక్క వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో పరీక్షలు ఉంటాయా.. లేక గతంలో మాదిరిగా నేరుగా ప్రమోట్ చేస్తారా? అన్న అంశాలపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.
పరీక్షల నిర్వహణపై భిన్నవాదనలు
ఆన్లైన్లో బోధన కొనసాగుతుండడంతో ప్రభుత్వం పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఆయా షెడ్యూల్ ప్రకారం మే 1నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. అదే నెలలో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దానికి తగ్గట్టుగా జిల్లాస్థాయిలో అధికారులు పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే భారీగా కేసులు పెరుగుతుండడంతో పది, ఇంటర్ పరీక్షల నిర్వాహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో గతంలో మాదిరిగా మళ్లీ ప్రమోట్ చేస్తారేమోనంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే లాక్డౌన్ అమలుకావడంతో మిగిలిన పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేశారు. కాగా ఈ యేడాది కూడా పదోతరగతి విద్యార్థులను అదేవిధంగా ప్రమోట్ చేస్తారని కొందరు భావిస్తున్నారు. అయితే ఇంటర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలను వాయిదా వేసైనా తరువాత నిర్వహిస్తారన్న వాదనలు వినిస్తున్నాయి.
కసరత్తు అశ్రద్ధ చేస్తున్న విద్యార్థులు
విద్యార్థి భవిష్యత్తు నిర్ణయానికి పదోతరగతి తొలిమెట్టు ఎలానో.. ఉన్నత విద్యకు ఇంటర్మీడియట్కు అంతే ప్రాధాన్యం ఉంది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు గుడ్బై చెప్పగా.. ఆన్లైన్లోనే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అయితే పరీక్షల నిర్వహణపైనే గందరగోళం నెలకొంది. కొందరు నిర్వహిస్తారని, కొందరు నిర్వహించరని ఎవరికివారు చర్చలు పెట్టి వాదిస్తుండడంతో క్షేత్రస్థాయిలో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ రెండు వాదనలు మధ్య నిలిగిపోతూ అసలు పరీక్షలకు సిద్దమవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరగవేమోనన్న ఆలోచనతో చదువును అశ్రద్ధ చేస్తున్నారు. అసలే ఆన్లైన్ తరగతులతో చదువులు అంతంతమాత్రంగా సాగుతుండగా పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా పరీక్షల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్తిదండ్రులు కోరుతుండగా, పరీక్షలు నిర్వహించినా లేకపోయినా విద్యార్థులు మాత్రం తమ భవిష్యత్తుకోసం చదువును అశ్రద్ధ చేయవద్దని, పరీక్షలకోసం శ్రద్ధగా చదవాల్సిందేనని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - 2021-04-11T05:41:26+05:30 IST