సింగరేణి ఆర్అండ్ఆర్లో సిమెంట్ మాయం..?
ABN, First Publish Date - 2021-10-29T05:35:59+05:30
సింగరేణి ఆర్అండ్ఆర్ గృహ సముదాయాల్లో సిమెంట్ బస్తాలు మాయమైనట్లు సమాచారం.
నిర్మాణాలకు వాగుల ఇసుక
సత్తుపల్లిరూరల్, అక్టోబరు 28: సింగరేణి ఆర్అండ్ఆర్ గృహ సముదాయాల్లో సిమెంట్ బస్తాలు మాయమైనట్లు సమాచారం. ఇసుక లోడింగ్కు వచ్చి వెళ్తున్న ఓ ట్రాక్టరులో గురువారం 8బస్తాల అపహరించేందుకు వేసుకున్నట్లు గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని సంబంధిత అధికారులు, కాంట్రాక్టరుకు సమాచారం ఇచ్చారు. కిష్టారం ఓసీ ఏర్పాటుతో జగన్నాథపురం నిర్వాసితుల కోసం మండలంలోని చెరుకుపల్లి గ్రామ శివారులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మించనున్నారు. తొలుత మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సిమెంట్ బస్తాల చోరీ విషయంలో సింగరేణి డీసీఎం సత్యనారాయణ, పోలీస్ సీఐ ఏ.రమాకాంత్ స్పందించలేదు.
స్థానిక వాగులో ఇసుక..?
మౌలిక వసతుల కల్పనకు గోదావరి ఇసుకను వాడాల్సి ఉండగా స్థానికంగా లభించే వాగుల్లో ఇసుకను నిర్మాణాలకు వాడుతున్నట్లు తెలుస్తుంది. 8సిమెంట్ బస్తాలతో పట్లుబడిన ట్రాక్టర్ సైతం చెరుకుపల్లి సమీపంలోని చిల్లవాగు నుంచి తెచ్చిన ఇసుకను లోడ్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు నిర్మాణాలకు ఎక్కడి ఇసుక వాడారు, నాణ్యత ప్రమాణాలు ఏమిటనే విషయమై అధికారులను ప్రశ్నించేందుకు కోరగా స్పందించలేదు. ఇటీవలే 100బస్తాల సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ పక్కదారి పట్టిన విషయంలో కిష్టారం ఓసీ పీవో తన పరిధిలోది కాదని తేల్చగా పోలీసుల విచారణ కొనసాగుతుంది. తాజాగా సిమెంట్ బస్తాల అపహరణకు యత్నించడం, 100లోడు బస్తాల సిమెంట్ పక్కదారిపై లోతుగా విచార ణ జరపాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2021-10-29T05:35:59+05:30 IST