బీటీపీఎస్కు బొగ్గు కష్టాలు
ABN, First Publish Date - 2021-10-30T05:09:00+05:30
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి ప్రధానమైన ముడి సరుకు బొగ్గు. అది ఎంత నాణ్యంగా ఉంటే ఉత్పత్తి అంత మెరుగ్గా ఉంటుంది.
జీ-9 బదులుగా జీ-14 గ్రేడ్ సరఫరా చేస్తున్న సింగరేణి
240 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
యూనిట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు
మణుగూరురూరల్, అక్టోబరు 29: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి ప్రధానమైన ముడి సరుకు బొగ్గు. అది ఎంత నాణ్యంగా ఉంటే ఉత్పత్తి అంత మెరుగ్గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కోల్ ఇండియా వ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరగడంతో నాణ్యత లేని బొగ్గు సరఫరా అవుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మణుగూరు ప్రాంతంలో నిర్మించింది. 1,080 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ పవర్ స్టేషన్ నాలుగు యూనిట్లకు గాను మూడు యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తవుతోంది. కాగా ఇటీవల నాణ్యత లేని బొగ్గు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బీటీపీఎస్లో ఇప్పటివరకు పూర్తయిన 1, 2, 3 యూనిట్లకు జీ-9 గ్రేడ్కు బదులు జీ-14 గ్రేడ్ నాణ్యత లేని బొగ్గు సరఫరా అవుతోంది. దీని వల్ల 270కు బదులు 240 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతోంది.
ఒప్పందం ఇలా.. జరిగేది ఇలా..
జెన్కో యాజమాన్యం సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి జెన్కో అఽధికారులు జీ-9 గ్రేడ్ బొగ్గును సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ సింగరేణి సంస్థ జీ-9 కు బదులుగా జీ-14 బొగ్గును సరఫరా చేస్తుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది. దీనిపై సింగరేణి అధికారులను పలు మార్లు సంప్రదించినా బొగ్గు బావుల్లో జీ-14 మాత్రమే ఉత్పత్తి అవుతోందని చెబుతున్నారు.
నాణ్యత తగ్గిన మాట వాస్తవమే : బాలరాజు, బీటీపీఎస్ సీఈ
బీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గులో నాణ్యత తగ్గిన మాట వాస్తవమే. సింగరేణితో జీ-9 గ్రేడ్ బొగ్గును సరఫరా చేయాలని ఒప్పందం కుదుర్చుకొన్నాం. గనుల్లో నిల్వ ఉన్న జీ-14 గ్రేడ్ సరఫరా చేస్తున్నారు. దీంతో కొంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. నాణ్యమైన బొగ్గు వస్తే సామర్థ్యం ప్రకారం విద్యుత్ను ఉత్పత్తి చేస్తాం.
Updated Date - 2021-10-30T05:09:00+05:30 IST