భయం.. భయం... ఉమ్మడి జిల్లాలో బ్లాక్ఫంగస్ ఆనవాళ్లు
ABN, First Publish Date - 2021-05-18T05:42:11+05:30
భయం.. భయం... ఉమ్మడి జిల్లాలో బ్లాక్ఫంగస్ ఆనవాళ్లు
కొందరిలో లక్షణాలతో అందరిలో కలవరం
నిర్ధారణకు రాలేకపోతున్న స్థానికవైద్యులు
ఖమ్మం/ సత్తుపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇన్నాళ్లు కరోనా బారినపడిన వారిలో యాంటీబాడీస్ ఉంటాయని, రెండోసారి అంత త్వరగా వైరస్ సోకదని, ఒకవేళ సోకినా పెద్దగా నష్టం ఉండ దన్న ప్రచారం జరిగింది. కానీ అలా ధీమాగా ఉన్నవారిలో ఇప్పుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. కరోనానుంచి కోరుకున్న తర్వాత బ్లాక్ఫంగస్ రూపంలో మరో ముప్పు ఉందన్న భయం వ్యక్త మవుతోంది. కరోనా సమయంలో వాడిన మందుల ప్రభావంతో చాలామందిలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి వస్తోం దన్న భయం వెంటాడుతోంది. ఇదే క్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులకు బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్టు తెలియడంతో ఆందోళన రెట్టింపవుతోంది.
ఒక్కొక్కటిగా వెలుగులోకి..
మొన్న చింతకానికి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు న్నాయన్న అనుమానంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అవి బ్లాక్ఫంగస్ లక్షణాలేనా అన్నదానిపై జిల్లా వైద్యశాఖ అధికారులకు ఓ స్పష్టత రాలేదు. హెర్పిస్, సెల్యులైటీస్గా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతలోనే భద్రాద్రి కొత్తగూడెం జిలా ్లలోని అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఓ మహిళకు బ్లాక్ ఫంగస్ లక్షణాలతో పెనుబల్లి ఆసుపత్రికి రాగా, కల్లూరు మండలా నికి చెందిన మరొకరికి లక్షణాలున్నాయని తెలియడం, ఇదే సమ యంలో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత బుడాన్బేగ్ బ్లాక్ ఫంగస్తో బెంగళూరు ఆసుపత్రిలో మృతి చెందారన్న వార్తలతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్లో పాజిటివ్గా నిర్దారణ జరిగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండగా.. కోలుకున్న వారిలోనూ రోజుల వ్యవధిలోనే బ్లాక్ ఫంగస్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి లక్షణాలు బయటపడతాయోనన్న భయంతో వణికిపోతున్నారు. కాగా ఆయా లక్షణాలపై స్థానిక వైద్యులు మాత్రం పూర్థిస్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారు. అలాంటి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు.
కొవిడ్ నుంచి కోలుకున్నాకే..
బ్లాక్ ఫంగస్.. కరోనా నుంచి కోలుకున్న తర్వాతే దీని లక్షణాలు బయటకు వస్తుంటాయి. కొవిడ్ నుంచి కోలుకునే సమయంలో వారు వాడిన మందుల ప్రభావం.. గతంలో ఉన్న ధీర్ఘకాలిక సమస్యల వల్లనో ఈ బ్లాక్ఫంగస్ వ్యాపిస్తోంది. గతంలో అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు కనుగొన్నారు. కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా బ్లాక్ఫంగస్ ఏర్పడే అవకాశాలున్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు సైనసైటిస్, డయాబెటిస్ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లోనూ ఈ లక్షణాలు బయటపడే అవకాశాలున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి కరోనా బారిన పడిన సమయంలో మందులు ఎక్కువ మొత్తంలో తీసుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ప్రజలు తమకు కరోనా సోకిన సమయంలో ఎలాంటి మందులు వాడారో అంటూ తమ మెడిసిన్ కిట్లను పరీక్షించుకుంటున్నారు. అయితే పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు కరోనా బాధితులకు ఇచ్చిన మందులే ఆ బ్లాక్ ఫంగస్ ఏర్పడటానికి కారణాలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్లాక్ ఫంగస్ లక్షణాలివే..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్లాక్ ఫంగస్ గురించిన సమాచారాన్ని వెల్లడించింది. దాని ప్రకారం బ్లాక్ ఫంగస్ ఏర్పడిన వారిలో ముక్కు చుట్టూ నొప్పి రావడం, కళ్లు ఎర్రబడటం, ముఖం వాపుతోపాటు తిమ్మిరిలు ఏర్పడతాయి. తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మానసిక స్థితి అదుపుతప్పడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముక్కులో దురద, కళ్లపైన, కింద ఉబ్బినట్టు కనిపించినా, కంటిచూపు మందగించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాల్సిందే. వెంటనే డాక్టర్ను సంప్రదించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యాధికారులు చెబుత
ున్నారు.
Updated Date - 2021-05-18T05:42:11+05:30 IST