ఈటల అనుచరుడికి కేడీసీసీ బ్యాంకు నోటీసులు
ABN, First Publish Date - 2021-05-07T09:37:51+05:30
ఈటల ముఖ్య అనుచరుడు, కరీంనగర్ జిల్లా వీణవంక మండల జడ్పీటీసీ మాడ వనమాల భర్త, సింగిల్ విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డికి గురువారం కరీంనగర్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్
ఈటల వెంట ఉన్నందుకేనా?
వీణవంక, మే 6: ఈటల ముఖ్య అనుచరుడు, కరీంనగర్ జిల్లా వీణవంక మండల జడ్పీటీసీ మాడ వనమాల భర్త, సింగిల్ విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డికి గురువారం కరీంనగర్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ (కేడీసీసీ) బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 2015 నుంచి 2019వరకు వీణవంక ప్రాథమిక సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్గా సాధవరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి 2016లో అనారోగ్యంతో మృతి చెందాడు. 2018 ఆడిట్ రిపోర్టులో సహకార సంఘానికి సంబంధించిన ఎరువులతో పాటు నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారించారు.
దీంతో అప్పటి పాలకవర్గాన్ని పూర్తిగా రద్దు చేయగా, నిధుల దుర్వినియోగంతో తమకు సంబంధం లేదని, దానికి ముఖ్య కార్యనిర్వహణాధికారే బాధ్యుడంటూ ఆ పాలకవర్గం కోర్టుకు వెళ్లింది. అనంతరం సహకార సంఘంలోని 13 మంది డైరెక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. అయితే, ఐదు రోజుల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో ఈటల రాజేందర్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న సాధవరెడ్డికి నోటీసులు రావడం వెనుక రాజకీయ కారణాలున్నాయని పలువురు భావిస్తున్నారు.
కక్షపూరితంగానే నోటీసులు : సాధవరెడ్డి
ఈటల రాజేందర్ వెంట ఉన్నందునే కక్షపూరితంగా తనకు నోటీసులు ఇచ్చారని సాధవరెడ్డి ఆరోపించారు. 2001 నుంచి తాము టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నామని, రెండేళ్లలో లేని నోటీసులు ఇప్పుడు ఇవ్వడమేంటని అన్నారు. కోర్టులో కేసు ఉండగా రాజకీయంగా తమపై ఒత్తిడి తేవడానికే ఇలా చేశారని పేర్కొన్నారు.
Updated Date - 2021-05-07T09:37:51+05:30 IST