యాసంగిలో కిలో వడ్లు కూడా కొనబోం: కేసీఆర్
ABN, First Publish Date - 2021-12-18T22:34:45+05:30
అనుకున్నదే అయింది. యాసంగిలో కిలో వడ్లు కూడా కొనబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు.
హైదరాబాద్: అనుకున్నదే అయింది. యాసంగిలో కిలో వడ్లు కూడా కొనబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. యాసంగిలో వరిధాన్యం కొనబోమని కేంద్రం పదేపదే చెప్తోందని, ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. వానాకాలం పంటలసాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటలసాగుపై దృష్టిసారించాలని సూచించారు. పత్తి, వరి, కందిసాగుపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణలోని వ్యవసాయ విధానాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్ తెలిపారు.
అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు కంటే వరిపైనా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో 2.49 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో అత్యధికంగా 1.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పత్తి 63 వేల ఎకరాల్లో సాగు చేసుకున్నారు. గత యాసంగిలో 167163 ఎకరాల్లో వరి సాగు చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పిస్తున్నా రైతులు వరి సాగు చేసి ధాన్యం అమ్ముకునే మార్గాల వైపు ఆలోచనలు చేస్తున్నారు. దీంతో యాసంగి సాగు ప్రశ్నార్ధకంగా మిగిలింది.
మరోవైపు వరి సాగు చేస్తే రైతు బంధు ఉండదనే ప్రచారం కూడా మొదలైంది. యాసంగిలో వరి వద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపుతున్నారు. బురద నేలల్లో ఆరుతడి పంటలు ఎలా వేసేదని రైతులు ప్రశ్నించడంతో అంతా అయోమయం నెలకొంది. యాసంగిలో వరిసాగును వదిలిపెడుతున్న రైతులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాసంగి సాగు కోసం రైతులకు ప్రతీ సీజన్లో రైతుబంధు కింద అందిస్తున్న పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.
Updated Date - 2021-12-18T22:34:45+05:30 IST