మూడు గంటల నిరీక్షణ.. పదినిమిషాల్లో ముగింపు
ABN, First Publish Date - 2021-07-27T05:51:10+05:30
మూడు గంటల నిరీక్షణ పది నిమిషాల్లో ముగిసి పోయింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు.
- ఓపికకు పరీక్ష పెట్టినందుకు మన్నించాలి
- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు
- కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
- జిల్లా ఆస్పత్రిలో సీటీస్కాన్ సేవలు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మూడు గంటల నిరీక్షణ పది నిమిషాల్లో ముగిసి పోయింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లాలో కొత్త రేషన్కార్డులకు 2,777 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 12 మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి మండలానికి పది మంది చొప్పున లబ్ధిదారులను జిల్లా కేంద్రానికి పిలిపించారు. ఉదయం 11.30 గంటలకు రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని ప్రకటించడంతో లబ్ధిదారులు 11 గంటలకే వచ్చి కలెక్టరేట్లో కూర్చున్నారు. వారితోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. జిల్లాకు 12.30 గంటలకు చేరుకున్న మంత్రి కేటీఆర్ ముందుగా తంగళ్లపల్లిలో పరామర్శలు తర్వాత సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని టీఆర్ఎస్కు చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. చివరకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కలెక్టరేట్కు చేరుకున్నారు. అప్పటికే చంటిపిల్లలతో తరలివచ్చిన లబ్ధిదారులు మూడు గంటలకు పైగా నిరీక్షించారు. భోజనం, నీళ్లు లేక అవస్థలు పడ్డారు. భార్యాభర్తలు పిల్లలను ఆడిస్తూ కనిపించారు. మంత్రి కేటీఆర్ హడావుడిగా వచ్చి నేరుగా లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ‘ఆలస్యంగా వచ్చినందుకు, మీ ఓపికను పరీక్షించినందుకు క్షమించాలి. కొత్త రేషన్ కార్డులు అందుకుంటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు’ అంటూ ముగించారు. అనంతరం అధికారులతో కలిసి భోజనాలు, రివ్యూ మీటింగ్లతో గడిపారు. రేషన్ కార్డుల పంపిణీలో నిమిషంన్నర కూడా మాట్లాడకపోవడంతో లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు నిరాశకు గురయ్యారు. మూడేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మోక్షం కలగడంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేసినానీళ్ల కోసం, ఇతర ఇబ్బందుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యసేవలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రూ 2.15 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీస్కాన్కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు దీని ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు. స్కానింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయన్నారు. కార్యక్రమాల్లో వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎస్పీ రాహుల్హెగ్డే, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 34వ వార్డులో కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైక్ సిస్టమ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వార్డులో రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అభినందించారు.
పరామర్శలు
టీఆర్ఎస్కు చెందిన పలు కుటుంబాలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం పరామర్శించారు. 4వ వార్డు కౌన్సిలర్ వెల్దండి దేవదాస్, మాజీ కౌన్సిలర్ వెల్దండి నారాయణ, కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు, దిడ్డి శ్రీనివాస్ కుటుంబాలను, ఇటీవల మరణించిన మాజీ కౌన్సిలర్ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకుడు చీటి నర్సింగరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-07-27T05:51:10+05:30 IST