వర్షం కురిసె.. రైతన్న మురిసె
ABN, First Publish Date - 2021-06-11T06:31:41+05:30
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముందే పలకరించడంతో రైతన్నలు ఖరీప్ సాగుకు సన్నద్ధమయ్యారు. మూడు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు బలపడి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సారి కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులు భావిస్తున్నారు.
- వానాకాలం సాగుకు సన్నద్ధం
- జిల్లాలో ఖరీఫ్ సాగు 2.80 లక్షల ఎకరాలు
- వరి 1.63 లక్షల ఎకరాలు, పత్తి 1.02 లక్షల..
- 66,750 మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం
- గతేడాది 915.3 మిల్లీ మీటర్ల వర్షానికి 1338.2 మిల్లీ మీటర్లు నమోదు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముందే పలకరించడంతో రైతన్నలు ఖరీప్ సాగుకు సన్నద్ధమయ్యారు. మూడు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు బలపడి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సారి కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులు భావిస్తున్నారు. గతేడాది సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో అన్నదాతలు ఈ సారి వానాకాలం 2.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. గత ఖరీఫ్ కాలం కంటే 33 వేల ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 80 వేల 944 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళిక వెల్లడించింది. ఇందులో వరి 1,63,000 ఎకరాలు, పత్తి లక్షా 2 వేల ఎకరాలు, మొక్కజొన్న 2000 ఎకరాలు, జొన్నలు 70 ఎకరాలు, కందులు 10,500 ఎకరాలు, పెసర్లు 1310 ఎకరాలు, మినుములు 68 ఎకరాలు, పల్లి 10 ఎకరాలు, ఆముదం 331 ఎకరాలు, సోయాబీన్ 27 ఎకరాలు, చెరకు 98 ఎకరాలు, ఇతర పంటలు 1530 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానాకాలం సాగులో 2,47,608 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈసారి 33,336 ఎకరాల్లో అదనంగా సాగు చేస్తున్నారు. ఇందులో వరి గత సీజన్లో 1,37,525 ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి అదనంగా 25,475 ఎకరాల్లో సాగు చేయనున్నారు. పత్తిపై ఈ సారి కూడా రైతులు ఆశలు పెంచుకున్నారు. గతంలో 97,839 ఎకరాల్లో సాగు చేయగా 1,02,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 4,161 ఎకరాల్లో సాగును పెంచుకున్నారు.
66,750 మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం
ఖరీఫ్ సాగుకు అవసరమయ్యే ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. 66,750 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. 66,750 మెట్రిక్ టన్నుల ఎరువుల్లో యూరియా 32,000 మెట్రిక్ టన్నులు, డీఏపీ 8000 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 8,250 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 18,500 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
గతేడాది1338.2 మిల్లీమీటర్ల వర్షం
గతేడాది జూన్ నుంచి ఈ సంవత్సరం మే వరకు సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షం కురిసింది. 915.3 మిల్లీమీటర్ల వర్షానికి 1338.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షంలో సిరిసిల్లలో 1521.7 మిల్లీమీటర్లు, బోయినపల్లి 1439.1, తంగళ్లపల్లిలో 1602.2, ముస్తాబాద్ 1219.5, ఇల్లంతకుంట 1536.4, వీర్నపల్లి 1251.3్ల, కోనరావుపేట 1250.4, గంభీరావుపేట 1233.9, ఎల్లారెడ్డిపేట 1095.7, వేములవాడ రూరల్ 1466.4, వేములవాడ 1441.8, చందుర్తి 1316.0, రుద్రంగిలో 1021.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Updated Date - 2021-06-11T06:31:41+05:30 IST