ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2021-02-28T06:13:47+05:30
ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దోచుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు.
మానకొండూర్, ఫిబ్రవరి 27: ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దోచుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. మానకొండూర్లోని కేఎస్సార్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరందడం లేదని, ఇక్కడి ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం సిగ్గు చేటని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేటకు సాగునీరందించడానికి మాత్రమే నిర్మించారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందని, ఆరున్నర ఏళ్లలో 45వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అందులో 35వేలు పోలీసు ఉద్యోగాలేనని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, దాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. వ్వవసాయ చట్టాలను రాజకీయం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, దళితమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, కల్లెపు వాసుదేవరెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు రాపాక ప్రవీణ్-వంగల ఆంజనేయులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-28T06:13:47+05:30 IST