శిలాఫలకంపై కనిపించని TRS ఎమ్మెల్సీ పేరు.. మంత్రికే నేరుగా ఫోన్ చేసి..!
ABN, First Publish Date - 2021-11-20T18:35:45+05:30
వాణీదేవి నేరుగా మంత్రికి ఫోన్ చేయగా..
- విషయం తెలియడంతో మంత్రికి వాణీదేవి ఫోన్
- జీహెచ్ఎంసీ అధికారులపై తలసాని ఆగ్రహం
- బేగంపేటలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో..
- ప్రొటోకాల్ వివాదం
హైదరాబాద్ సిటీ/బేగంపేట : చిన్నపాటి వర్షానికే బేగంపేట బ్రాహ్మణవాడిలో పెద్దఎత్తున వర్షంనీరు చేరుతోంది. దీనికితోడు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానికుల విజ్ఞప్తి చేరకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆ ప్రాంతంలో సివరేజీ పైపులైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులను ప్రారంభించేందుకు అధికారులతో కలిసి బ్రాహ్మణవాడి లేన్ నంబర్ 5కి వచ్చారు. 5, 7, 9 లేన్లలో పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా 5వ లేన్లో పనులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్సీ వాణీదేవి పేరు లేకపోవడంతో అభిమానులు విషయాన్ని ఆమెకు తెలియజేశారు.
దీంతో వాణీదేవి నేరుగా మంత్రికి ఫోన్ చేయగా.. జీహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణీదేవి పేరు ఉన్న శిలాఫలకం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 7, 9 లేన్లలో సివరేజీ పనులను ప్రారంభించకుండానే మంత్రి వెళ్లిపోయారు. అంతకు ముందు బేగంపేట ఎయిర్లైన్స్కాలనీ, భగవంతాపూర్లో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ టి. మహేశ్వరితో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-20T18:35:45+05:30 IST