తెలంగాణ భవన్లో లుకలుకలు..సారూ మీకో దండం అంటూ బయటకొస్తున్న సీనియర్లు..!
ABN, First Publish Date - 2021-12-02T16:51:03+05:30
అధికారపార్టీలోని సీనియర్లు కారు దిగడం స్టార్ట్ చేయడంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. సీపీఎం, కాంగ్రెస్, వైసీపీల్లో కీలకంగా పనిచేసిన గట్టు రాంచందర్రావును 2015లో కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీ కార్యవర్గంలో
పునరేకీకరణ పేరుతో ఇళ్లంతా సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో లుకలుకలు బయటపడుతున్నాయి. తమకన్నా జూనియర్లు పదవులు తన్నుకుపోతుండటంతో తట్టుకోలేకపోతున్న సీనియర్లు..సారూ మీకో దండం అంటూ గేటు దాటి బయటకొస్తున్నారు. రోడ్డుమీదకొచ్చి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తిచాటుతున్నారు. పెద్దసారు నమ్మించి మోసం చేయడంతో భవన్లో చాలామంది బలిపశువులు గొల్లుమంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ వీడిన, వీడాల్సివచ్చిన నేతలు అసంతృప్తులను టచ్లోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
సార్ తీరుతో రగిలిపోతున్న గులాబీసైన్యం!
అధికారపార్టీలోని సీనియర్లు కారు దిగడం స్టార్ట్ చేయడంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. సీపీఎం, కాంగ్రెస్, వైసీపీల్లో కీలకంగా పనిచేసిన గట్టు రాంచందర్రావును 2015లో కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీ కార్యవర్గంలో అవకాశం కల్పించినా ఎలాంటి నామినేటెడ్ పదవినీ కేటాయించలేదు. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఆశగా చూసిన గట్టు తనకు ఆ అవకాశం దక్కదని తెలిసి గుడ్బై చెప్పారు. బీజేపీ నుంచి టీఆరెఎస్లో చేరిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో పింక్ పార్టీకి బైబై చెప్పేశారు. ఈ ఇద్దరే కాదు పార్టీలో చాలామంది ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో, నామినేటెడ్ పోస్టులు దక్కకపోవడంతో రగిలిపోతున్నారు.
రాజీనామా చేసే యోచనలో సీనియర్లు
కొత్త చుట్టాలకు ఇచ్చిన గుర్తింపు తమకు ఇవ్వడం లేదన్న అసహనం ఇప్పుడు గులాబీ దళంలో మొదలైంది. తాజాగా భర్తీ చేసిన 19 mlc స్థానాల్లో కొత్తగా వచ్చిన కౌశిక్ రెడ్డి, ఎల్ రమణ, తాత మధు లాంటివారికి అవకాశం ఇవ్వడం పార్టీలోని సీనియర్లకు కోపం తెప్పించింది. హుజూరాబాద్లో ఎన్నిక కోసం కౌశిక్ రెడ్డికి అందలం ఎక్కించారని... టిడిపి నుంచి తీసుకొచ్చిన ఎల్ రమణకు పదవి కట్టబెట్టారని... అసలు తాత మధు లాంటి వ్యక్తులు పార్టీ కోసం ఎక్కడ కష్టపడ్డాడో చెప్పాలంటూ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఏళ్ల తరబడి పార్టీనీ నమ్ముకొని ఉన్న నేతలను కాదని... కొత్తగా వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను అవమాన పరిచారన్న ఆవేదన పార్టీలో అంతర్గతంగా మారుమోగుతోంది. గులాబీ దళంలోని సెకండ్ క్యాడర్తో పాటు... అవకాశాలు దక్కని ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
చెరుకు, జిట్టా, తూంకుంట, అలుగుబెల్లి, కొండా ఇలా ఎందరో...
ఇప్పటికే ఉద్యమ సమయంలో పనిచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణ రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, తూంకుంట నర్సారెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డి, జనార్దన్ గౌడ్, అలుగుబెల్లి అమరేందర్రెడ్డి , కొండా విశ్వేశ్వర్రెడ్డి , జితేందర్రెడ్డి ఇలా చాలా మంది నేతలు పార్టీ వీడారు. పార్టీలో గుర్తింపు లభించడం లేదని కొందరు రాజీనామా చేయగా , మరికొందరని వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పార్టీ సస్పెండ్ చేసింది. మళ్లీ చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు ప్రారంభం కావడంతో ఇక పార్టీకి గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
Updated Date - 2021-12-02T16:51:03+05:30 IST