విద్యుత్శాఖలో పైరవీలు
ABN, First Publish Date - 2021-07-26T05:15:19+05:30
దక్షిణ తెలంగాణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజనీర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఇంజనీర్లలో
శివార్లలో పోస్టింగులకు తీవ్ర పోటీ
అసోసియేషన్లు, కార్పొరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
హైదరాబాద్ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజనీర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఇంజనీర్లలో ఉత్సాహం నెలకొంది. కొంతకాలం క్రితమే పూర్తి చేయాల్సిన బదిలీల ప్రక్రియ కొవిడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. మూడేళ్లు పూర్తి చేసుకున్న ఏఈ, ఏడీఈ, డీఈ కేటగిరీలో 50 శాతానికి మించకుండా బదిలీలు ఆగస్టు 5 నాటికి పూర్తిచేయాలని డిస్కం భావిస్తోంది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో పోస్టింగ్లు సాధించుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆపరేషన్ విభాగంలో శివారు ప్రాంతాల్లో పోస్టింగు తెచ్చుకునేందుకు కొంతమంది అధికారులు లక్షల్లో ఖర్చుచేయడానికి సిద్ధమవుతున్నారు. మరి కొంతమంది అధికారులు తమకున్న పరిచయాలతో మంత్రుల నుంచి సిఫార్సులు చేయించుకోవడంతోపాటు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాఽధికారులను కలుస్తూ తాము కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు తెప్పించుకునే ప్రయత్నాలు మొద లు పెట్టారు. కూకట్పల్లి, కీసర, షాద్నగర్, కందుకూరు, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏడీఈ పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఏఈ నుంచి ఏడీఈ, డీఈలకు సంబంధించి ఇస్నాపూర్, షాపూర్నగర్, మేడ్చల్, శామీర్పేట, మహేశ్వరం, పటాన్చెరువు, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, బాచుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పోస్టింగులు తెచ్చుకునేందుకు కొంతమంది అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. శివారుప్రాంతాల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు భారీగా చేపడుతుండడంతో అలాంటి ప్రాంతాల్లో పోస్టింగ్లు తెచ్చుకుంటే భారీగా ఆదాయం సంపాదించుకోవచ్చనే ధోరణిలో కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సందడిగా అసోసియేషన్ కార్యాలయాలు
బదిలీల ప్రక్రియకు మార్గదర్శకాలు విడుదల కావడంతో రెండు రోజులుగా అసోషియేషన్ల కార్యాలయాలు సందడిగా మారాయి. తమకు పోస్టింగుకు ఇప్పించాలంటూ కొందరు అసోసియేషన్ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ సారి పనితీరు ఆధారంగానే ఇంజనీర్ల ట్రాన్స్ఫర్లు చేపట్టేలా డిస్కం చర్యలు తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో 20కి పైగా ఉన్న అసోసియేషన్ల తీరుపై ఆగ్రహంగా ఉన్న మేనేజ్మెంట్ ఇంజనీర్ల ట్రాన్స్ఫర్ల అంశంలో ఒత్తిడి చేస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2021-07-26T05:15:19+05:30 IST