Sai Dharam Tej ఇలా చేసుంటే సేఫ్గా బయటపడేవారేమో..!
ABN, First Publish Date - 2021-09-11T16:52:10+05:30
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుపై..
హైదరాబాద్ సిటీ : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్పై నుంచి పడి గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో ప్రస్తుతం నగరంలోని అపోలో ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ప్రమాదానికి గల కారణాలేంటి..? అనే విషయాలు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడి నిశితంగా వివరించారు. అయితే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచే ఎందుకెళ్లాడు..? అక్కడ్నుంచి ఎక్కడికెళ్తున్నాడు..? అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మరోవైపు.. ఈ ప్రమాదం తర్వాత కొందరు బైక్ నిపుణులు తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.
వీకెండ్స్ పార్టీకి వెళ్తుండగా...!?
వీకెండ్ కావడంతో పార్టీకి అటెండ్ కావడానికి సాయిధరమ్తేజ్ బయలుదేరినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రెగ్యులర్గా వీకెండ్స్లో సాయి ధరమ్తో పాటు పలువురు యువ హీరోలు పార్టీలకు హాజరవుతుండే వారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో సందీప్ కిషన్, కమెడియన్ వైవా హర్ష, నటుడు నరేష్ కుమారుడితో కలిసి బైక్పై రైడింగ్కు కూడా సాయి వెళ్లేవాడని సమాచారం. అంతేకాదు.. ఐటీసీ కోహినూర్ వెనుక ప్రతిరోజూ సాయి ధరమ్ బైక్ రైడ్ చేసేవాడట. ఆయనతో పాటు చాలా మందే యువ హీరోలు ఇలా రైడ్కు వెళ్తుండే వారని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ఫ్రెండ్స్తో పార్టీలో ఎంజాయ్ చేయడానికి వెళ్తుండగా.. ఓవర్ స్పీడ్ కావడంతో ఇలా ప్రమాదం జరిగిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉందని బైక్ స్కిడ్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు..?
రైడ్కు వెళ్లే ప్రతిసారీ బైక్ సూట్, నీప్యాడ్స్ ధరించే బైక్పై వెళ్లేవాడని సాయి ధరమ్ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. అయితే శుక్రవారం రోజు మాత్రం హెల్మెట్ మాత్రమే ధరించి వెళ్లాడని అంటున్నారు. ఒకవేళ బైక్ సూట్ వేసుకుని వెళ్లుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. సూట్ ఉండుంటే తప్పకుండా సేఫ్గానే సాయి బయటపడేవాడని నిపుణులు, పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బైక్ పేరు Triumph RS Street Triple. బైక్ 765 సీసీ ట్రిపుల్ సిలిండర్ ఇంజిన్.
వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఇవాళ ఉదయం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆపోలో ఆసుపత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని వైద్య పరీక్షలు చేశామని.. ఇవాళ మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బులెటిన్ వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించి ఆదివారం నాడు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్య బృందం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదుసాయి ఆరోగ్యం నిలకడగా ఉంది: చిరంజీవిAccident: అపస్మారక స్థితిలో హీరో సాయి తేజ్అపోలో ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్
Updated Date - 2021-09-11T16:52:10+05:30 IST