రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర
ABN, First Publish Date - 2021-04-12T06:49:45+05:30
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలకు పాల్పడుతోందని పలు పార్టీలు, సంఘాల నాయకులు ఆరోపించారు.
రౌండ్టేబుల్ సమావేశంలో పార్టీలు, సంఘాల నాయకులు
పంజాగుట్ట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలకు పాల్పడుతోందని పలు పార్టీలు, సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు - ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రిజర్వేషన్ల పరిరక్షణ - ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఆదివారం గిరిజన శక్తి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహన్, జాతీయ అధ్యక్షడు రాజేష్ నాయక్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దేశానికి గుండెకాయలాంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఆరోపించారు. ప్రైవేటీకరణ చేస్తే తప్ప దేశం బాగుపడదు అని ప్రధానమంత్రి మోదీ మాట్లాడడం బాధాకరమన్నారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు సాగర్లో తిష్ఠ వేశారన్నారు. పబ్లిక్ సెక్టార్ను కాపాడుతూ వచ్చింది వామపక్షాలేనన్నారు. పాలకులు రాజ్యాంగ వ్యవస్థను, అంబేడ్కర్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కేంద్రం కాలరాస్తోందని దళిత ఉద్యమ నేత జేబీ రాజు ఆరోపించారు. గిరిజన శక్తిని బహుజన శక్తిగా మార్చాలన్నారు. సాకులు చూపుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూడడం అన్యాయమని అన్నారు. సమావేశంలో సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, సీనియర్ పాత్రికేయుడు పీవీ శ్రీనివాస్, ప్రకాష్ రాథోడ్, డీబీఎస్ రాష్ట్ర నాయకుడు శంకర్, టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్, వివిధ సంఘాల నాయకులు రమణ, జీవన్, పబ్బతి శ్రీకృష్ణ తదితరులు మాట్లాడారు.
Updated Date - 2021-04-12T06:49:45+05:30 IST