Hyderabad MMTS : లేడీ కంపార్ట్మెంట్లోకి వచ్చి.. రైల్వే ఉద్యోగినిని కత్తితో బెదిరించి..!
ABN, First Publish Date - 2021-12-22T12:22:54+05:30
లేడీ కంపార్ట్మెంట్లోకి వచ్చి.. రైల్వే ఉద్యోగినిని కత్తితో బెదిరించి..!
- దుండగుడి దోపిడీ
- సెల్ఫోన్ చోరీ..
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : ఎంఎంటీఎస్లో ప్రయాణిస్తున్న రైల్వే ఉద్యోగినిని కత్తితో బెదిరించి ఓ దుండగుడు సెల్ఫోన్ ఎత్తుకెళ్లాడు. బాధితురాలు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో నివాసం ఉండే మణికర్ణ బిరాదర్ 15 ఏళ్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంలో సీనియర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. రోజూ ఎంఎంటీఎస్లో లింగంపల్లికి వెళ్లే ఆమె సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వరకు మెట్రోరైలులో వచ్చారు.
రాత్రి 10.37 సమయంలో బేగంపేట్లో ఎంఎంటీఎస్ ఎక్కారు. మణికర్ణ బిరాదర్ లేడీస్ కోచ్లో ఉన్నారు. రైలు బోరబండ స్టేషన్లో నిమిషం పాటు ఆగి స్టార్ట్ కాగానే గుర్తు తెలియని వ్యక్తి లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. ఆ కంపార్ట్మెంట్ మొత్తంలో మణికర్ణ ఒక్కరే ఉన్నారు. ‘ఇది లేడీస్ కోచ్. ఇందులో మగవారు ఎక్కకూడదు’ అని దుండగుడితో మణికర్ణ వాగ్వాదానికి దిగారు. ఇంతలో అతడు కత్తి చూపించి.. ఆమె చేతిలోని రూ. 35 వేల విలువ గల సెల్ఫోన్ను లాక్కొని రైలు దిగి పరారయ్యాడు. భయాందోళనకు గురైన మణికర్ణ చందానగర్లోని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-12-22T12:22:54+05:30 IST