పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం చెంది..
ABN, First Publish Date - 2021-05-17T13:46:38+05:30
వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు, మతాలు వేరైనా పెళ్లిచేసుకుందామని పెద్దలను ఆశ్రయిస్తే..
- క్వారీలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
హైదరాబాద్/జీడిమెట్ల : వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు, మతాలు వేరైనా పెళ్లిచేసుకుందామని పెద్దలను ఆశ్రయిస్తే వారు నిరాకరించారు. అంతేకాక గుట్టుచప్పుడు కాకుండా వేరే సంబంధాలు చూస్తుండటంతో తాము జీవితంలో ఒక్కటి కాలేమని నిర్ధారించుకున్న ఈ అమర ప్రేమికులు, చావే శరణమ్యని భావించారు. శుక్రవారం తెల్లవారుజామున గాజులరామారం క్వారీగుంతలోకి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈహృదయ విదారకమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఎల్లమ్మబండ ప్రాంతంలోని ఎన్టీఆర్నగర్లో నివాసముంటున్న ఓ బాలిక (16) కేపీహెచ్బీ కాలనీలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడు (20) ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. దీనికి వారు అంగీకరించలేదు. బాలికకు జనగాంలో ఓ సంబంధం చూసి ఖాయం చేయడంతో ప్రేమికులిద్దరు తీవ్రంగా కుమిలిపోయారు. ఈనెల 14వతేదీ తెల్లవారుజామున బాలిక ఇంటినుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 3.30గంటల ప్రాంతంలో గాజులరామారం బాలయ్యనగర్ క్వారీల్లో శవాలు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడి చేరుకుని శవాలను పరిశీలించి అదృశ్యమైన బాలికగా గుర్తించారు. అదేవిధంగా యువకుడి శవాన్ని కూడా గుర్తించి గజ ఈతగాళ్ల సాయంతో వెలుపలికి తీయించారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు ఒడిగట్టినట్టు నిర్ధారించారు. లాక్డౌన్ కావడంతో కనీసం వీరు బయట కలుసుకునే పరిస్థితులు లేకపోవడంతో ఇద్దరూ ఇంటి నుంచి అదృశ్యమై ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొంటున్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-05-17T13:46:38+05:30 IST