కోట్ల స్టేడియంకు కరెంట్ కట్.. జీతాలు లేవు!
ABN, First Publish Date - 2021-02-28T16:25:30+05:30
యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి) : యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు సరఫరా నిలిపేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండోర్ స్టేడియం మొత్తం అంధకారం ఆవహించింది. నిత్యం వందల సంఖ్యలో అక్కడ సాధన చేసే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు చీకట్లో ఆడలేక స్టేడియంకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయి నాలుగురోజులు కావస్తున్నా సమస్య పరిష్కరించని స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవీందర్పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు, గచ్చిబౌలి స్టేడియంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కిందటి ఏడాదికి సంబంధించిన మూడు నెలల జీతం ఇప్పటి వరకు ఇవ్వలేదని విధులు బహిష్కరించారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-02-28T16:25:30+05:30 IST