దళితులు సీఎం పదవికి అర్హులు కాదా? సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలి: కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2021-11-22T21:43:10+05:30
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేస్తారా? చేయరా? సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్య రైతులది కాదని, కదులుతోన్న టీఆర్ఎస్ పార్టీ పునాదులదే అసలు సమస్య అన్నారు. దళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? సీఎం స్పష్టం చేయాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం లేని సమస్యను సృష్టించి సీఎం రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్ళుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటోందన్నారు. హుజురాబాద్ ఓటమిని డైవర్ట్ చేయటానికే కేంద్రంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
పార్టీని బ్రతికించుకోవటానికి ముఖ్యమంత్రి ధర్నాలు చేయటం మెదటసారి చూస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయన్నారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ కుటుంబం శక్తినంతా ధారపోసినా హుజురాబాద్లో ఓటమి తప్పలేదన్నారు. బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్గా పోచంపల్లి గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబరు 6న విద్యార్థుల స్కాలర్ షిప్స్ను జమ చేస్తామన్నారు. సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు నవ తరానికి తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-11-22T21:43:10+05:30 IST