సిమ్కార్డులు చైనాకు చేరవేత.. హైదరాబాద్ లింకులపై ఆరా!
ABN, First Publish Date - 2021-06-15T12:31:27+05:30
భారతదేశంలో సుమారు 1300 సిమ్కార్డులను కొని చైనాకు చేరవేసిన...
- సిమ్ యాక్టివేషన్ పద్ధతులను పరిశీలిస్తున్న ట్రాయ్
హైదరాబాద్ సిటీ : భారతదేశంలో సుమారు 1300 సిమ్కార్డులను కొని చైనాకు చేరవేసిన చైనా దేశస్తుడు హాన్ జున్వేకు నగరంతో ఏదైనా లింకులున్నాయా అంటూ హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇండో- బంగ్లా సరిహద్దులో హాన్ జున్వేని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. పలుమార్లు రహస్యంగా భారత్కు వచ్చి వెళ్లిన అతను హైదరాబాద్లో కూడా కొంతకాలం తలదాచుకున్నాడనే అంశా లు వెలుగు చూస్తుండటంతో ఆ దిశలో ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థలు ఈ కేసును పరిశోధిస్తున్నందున వారి విచారణలో వెలుగు చూసే అంశాలపై నగర పోలీసులు దృష్టి సారించారు.
సిమ్కార్డులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారంటూ దర్యాప్తు సంస్థలతో పాటు ట్రాయ్ కూడా దృష్టి సారించింది. ఒకవేళ కొనుగోలు చేసిన సిమ్కార్డుల ఆధారాలు నేరుగా లభించకుంటే, విదేశాలలో యాక్టివేట్ అయినా.. అక్కడ నుంచి ఇక్కడికి జరిగిన కాల్స్, ఇతర కమ్యూనికేషన్ లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కూడా ఈ విషయంలో దృష్టి సారించినప్పటికీ, హైదరాబాద్ లింకుల గురించి స్పష్టమైన సమాచారం వస్తేనే తదుపరి విచారణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 2010-11 కాలంలో సిమ్కార్డులు విక్రయించిన తీరుపై కూడా వారు ఆరా తీస్తున్నారు. అప్పట్లో గుర్తింపు పత్రాలు ఇచ్చే పద్ధతి ఉన్నప్పటికీ.. ఎలాంటి గుర్తింపు పత్రాలిచ్చారు...? ఆయా పత్రాల డేటా ఇప్పుడు లభిస్తుందా అనే అంశాల్లో కూడా పోలీసులు కూపీ లాగేందుకు సిద్ధమవుతున్నారు.
Updated Date - 2021-06-15T12:31:27+05:30 IST