న్యాయవాదిపై హత్యాయత్నం కేసు మిస్టరీ
ABN, First Publish Date - 2021-02-25T06:49:06+05:30
న్యాయవాదిపై హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. న్యాయవాదిని హత్య చేసేందుకు నలుగురు నిందితులు కుట్ర పన్నినట్లు జాయింట్ సీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
నలుగురు నిందితుల అరెస్టు
హిమాయత్నగర్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదిపై హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. న్యాయవాదిని హత్య చేసేందుకు నలుగురు నిందితులు కుట్ర పన్నినట్లు జాయింట్ సీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఘటనా స్థలంలో గన్, రెండు చాకులు, 7 బుల్లెట్లు, సుజుకీ యాక్సెస్ వాహనం, కాకీ రంగు ఫేస్ మాస్క్, సిల్వర్ రంగు టేపు, రెండు చేతి గ్లౌజ్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కాచిగూడకు చెందిన ఘన్శ్యామ్ బాలాజీసింగ్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం నారాయణగూడ పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, అబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, ఎస్హెచ్వో పాలేపల్లి రమేష్కుమార్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాచిగూడకు చెందిన ఘన్శ్యామ్ బాలాజీసింగ్ ఆటోమొబైల్ మెకానిక్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాచిగూడలోని తన ఇంటి వ్యవహారం, రాజేంద్రనగర్లోని న్యాయవాది తండ్రి స్థలం విషయంలో తనకు కమీషన్ రాకుండా అడ్డుపడుతున్నాడనే కారణంతో న్యాయవాదిపై బాలాజీసింగ్ కక్ష పెంచుకున్నాడు. న్యాయవాదిని చంపాలని బండ్లగూడకు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ వలీ సహాయం కోరాడు. మహ్మద్ వలీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ వశీం అన్సారీ, హసన్నగర్కు చెందిన షేక్ సులేమాన్తో కలిసి ఈనెల 16వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ 7లో నివసిస్తున్న న్యాయవాది సిద్దార్ధసింగ్ చౌదరి వద్దకు వెళ్లారు. ముగ్గురూ ముఖానికి మాస్క్లు, చౌతికి గ్లౌజ్లు ధరించారు. లోపలికి వెళ్లి డాక్టర్ మాలిక్ ఫైల్ కావాలని అడిగారు. మీరెవరంటూ న్యాయవాది ప్రశ్నించేలోపు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. కత్తులు తీసి పొడవగా న్యాయవాది తప్పించుకొని కిచెన్లోకి పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Updated Date - 2021-02-25T06:49:06+05:30 IST