లక్షలు ఇచ్చి.. శిక్షలు అనుభవిస్తున్నారు
ABN, First Publish Date - 2021-04-12T06:53:37+05:30
ఇద్దరూ ఐటీ ఉద్యోగులే.. చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో వారి పెళ్లయింది. పెళ్లి సమయంలో
మహిళలపై తగ్గని గృహ హింస
భరించలేక మహిళా భద్రతా విభాగానికి వస్తున్న బాధితులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఇద్దరూ ఐటీ ఉద్యోగులే.. చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో వారి పెళ్లయింది. పెళ్లి సమయంలో లక్షల్లో కట్నం ఇచ్చారు. గచ్చిబౌ లిలో ఉంటున్నారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్లయినప్పటి నుంచి ఆ దంపతుల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు కూడా పెరుగుతూ వచ్చాయి. భార్యను భర్త మానసిక క్షోభకు గురిచేసేవాడు. ఇటీవల కాలంలో అతడి వేధింపులు మరింత పెరగడంతో ఆమె మహిళా భద్రతా విభాగం పోలీసులను ఆశ్రయించింది. భర్త చెర నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే భర్త, అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు ఎంతోమంది భరిస్తున్నారని మహిళా పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతిరోజూ సుమారు పదికి పైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొంటున్నారు.
- పెళ్లికి ముందు లక్షల రూపాయలు, తులా ల కొద్దీ బంగారం, ఖరీదైన కానుకలు తీసుకొని, పెళ్లయిన తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలు వేధిస్తున్న ఉదంతాలు ఉన్నాయి.
- పెళ్లి అయిన కొత్తలో బాగా చూసుకొని ఆ తర్వాత ఆడపిల్లకు జన్మనిచ్చిందనే నెపం కోడలిపై వేసి, ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్న సంఘటనలు కొన్ని..
- అదనపు కట్నం కోసం భర్తతో కలిసి అత్తామామలు, ఆడపడచులు మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో తన కష్టాన్ని కన్నవాళ్లకు చెప్పలేక, వారిని మరింత ఇబ్బంది పెట్టలేక ఎంతోమంది అభాగ్యులు బలవన్మరణంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
రెండేళ్లలో (2019, 2020) సైబరాబాద్లో మహిళలపై జరిగిన గృహహింస, ఇతర నేరాలు పట్టికలో..
నేరం 2019 2020
వరకట్న హత్యలు 7 4
వరకట్నం చావులు 26 18
ప్రేరేపిత బలవన్మరణాలు 64 52
గృహ హింస 1278 934
మహిళా హత్యలు 40 22
మహిళలపై అత్యాచారాలు 307 274
కిడ్నా్పలు 314 311
వేధింపుల కేసులు 786 680
అఽధిక పెళ్లిలు చేసుకొని వేధింపులు 8 7
మొత్తం 2830 2302
ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు
భర్త అత్తామామల వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. భర్త మానసిక వేదనకు గురిచేస్తే సహించొద్దు. ధైర్యంగా నిలదీయాలి. పురుషులతో సమానంగా, తలెత్తుకొని జీవించే అవకాశం, హక్కు మహిళలకు ఉందని గుర్తించాలి. భర్త, అత్తామామల వేధింపులు భరించలేని బాధిత మహిళలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో న్యాయం చేయాలని కమిషనరేట్కు వస్తున్నారు.
- అనసూయ, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్
Updated Date - 2021-04-12T06:53:37+05:30 IST