‘ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం.. వెంటనే తీన్మార్ మల్లన్నను రిలీజ్ చేయాలి’
ABN, First Publish Date - 2021-09-09T14:50:23+05:30
తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు
హైదరాబాద్ సిటీ/కృష్ణానగర్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదం అంచున ఉందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలంటూ అఖిలపక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జర్నలిస్టులు పాశం యాదగిరి, రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందన్నారు. యాదగిరి మాట్లాడుతూ మల్లన్నను విడుదల చేసేంత వరకు సమాజం ఆయన పక్షాన పోరాడుతుందన్నారు. రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తెలంగాణ రాష్ట్రంలో అణిచివేతకు గురవుతున్నాయన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న సతీమణి మాట్లాడుతూ వందల మంది పోలీసులు ఇంటికొచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, మల్లన్న టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-09T14:50:23+05:30 IST