పేరు పాండు.. వయస్సు 19.. చేసేవన్నీ పాడుపనులే.. జైలుకెళ్లొచ్చినా..!
ABN, First Publish Date - 2021-07-30T13:19:13+05:30
జువెనైల్ హోంకు వెళ్లినా అతడిలో మార్పు రాలేదు. 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత...
- వయస్సు 19.. చోరీలు 14
హైదరాబాద్ సిటీ/చాదర్ఘాట్ : బాల్యం నుంచే చోరీల బాటపట్టాడు. జువెనైల్ హోంకు వెళ్లినా అతడిలో మార్పు రాలేదు. 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత చోరీలు చేస్తూ మలక్పేట పోలీసులకు పట్టుబడ్డాడు. 19 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అతడు చేసిన చోరీల సంఖ్య 14కు చేరింది. మలక్పేట క్రైం ఇన్స్పెక్టర్ నాను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం, అనురు గ్రామ నివాసి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ అలియాస్ పాండు(19) దినసరి కూలీ. 16 ఏళ్ల వయస్సు నుంచే తాళంవేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు.
ఈనెల 24న ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్నగర్ కాలనీలోని సింధూర హైట్స్లో నివసిస్తున్న గంగారావు ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో భద్రపరిచిన నాలుగు తులాల బంగారు నగలు చోరీ చేశాడు. మలక్పేట పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి కదలికలపై నిఘా పెట్టాడు. గురువారం కొత్తపేటలో హాస్టల్లో పనిచేస్తున్న తల్లిదండ్రులను కలవడానికి వెళ్లగానే పట్టుకుని నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాచకొండ పరిధిలో 13, నగర పోలీస్ కమిషనరేట్లో ఒక చోరీ చేశాడని తెలిపారు.
Updated Date - 2021-07-30T13:19:13+05:30 IST