హుజూరాబాద్ తీర్పుతో రాష్ట్రంలో మార్పు
ABN, First Publish Date - 2021-10-21T08:59:01+05:30
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో..
ఎవరి వల్ల దళితబంధు ఆగిందో యాదాద్రిలో ప్రమాణం చేద్దామా?
టీఆర్ఎస్ వల్లేనని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తావా?
కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
జమ్మికుంట రూరల్, అక్టోబరు 20: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో మార్పు తెస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే సీఎం కేసీఆర్ అహంకారం అణిచేవిధంగా ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ వల్లనే దళితబంధు ఆగిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గుడి వద్దకు పోదాం. అక్కడే ప్రమాణం చేద్దాం. బీజేపీ వల్లనే దళితబంధు ఆగిందని నువ్వు ప్రమాణం చేయి. ముక్కు నేలకు రాసి నేను రాజీనామా చేస్తా. టీఆర్ఎస్ వల్లే దళితబంధు ఆగిందని నిరూపిస్తే నువ్వు సీ ఎం పదవికి రాజీనామా చేస్తా వా?’’ అని ముఖ్యమంత్రికి సంజ య్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ ప్రజలకు నవంబరు 2వ తేదీనే దీపావళి అని అన్నా రు. హరీశ్ రావు అబద్ధాలు ఆడవద్దని, పేదవాళ్ల ఉసురు తాకుతుందన్నారు. ఈటల కాంగ్రె్సలోకి పోతాడని టీఆర్ఎస్ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాళ్లు డ్రామా లు ఆడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్, కేటీఆర్, కవిత తప్ప టీఆర్ఎస్ నుంచి అందరూ బీజేపీలోకి వస్తారన్నారు. బీజేపీని గెలిపిస్తే ప్రగతిభవన్ గడీలు బద్దలు కొట్టి దళితబంధు డబ్బులు అందేలా కొట్లాడతానని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇచ్చి 3 లక్షల ఇళ్లు కట్టాలని చెబితే.. కేసీఆర్ మాత్రం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదని ధ్వజమెత్తారు.
Updated Date - 2021-10-21T08:59:01+05:30 IST