మూడో భార్య కోసం.. రెండో భార్యను చంపేందుకు క్షుద్ర పూజలు..!
ABN, First Publish Date - 2021-12-05T20:00:57+05:30
మూడో భార్య కోసం.. రెండో భార్యను చంపేందుకు నిత్య పెళ్లికొడుకు క్షుద్ర పూజలు..!
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పాల్వంచ పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కట్టుకున్న రెండో భార్య గోపికను హతమార్చేందుకు భర్త క్షుద్రపూజలు చేయించడం స్థానికంగా సంచలనంగా మారింది. కంప్యూటర్ యుగంలోనూ ఇలా తాంత్రిక పూజలు చేయించడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదంతా జరిగింది ఎక్కడో మారుమూల పల్లెలో కాదండోయ్.. జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఇలా పూజలు వెలుగు చూడడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శేఖరబంజరకు చెందిన కుమార్ ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈయన కొన్నేళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేసి గోపిక అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అనంతం ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు మొత్తం తీసేసుకున్నాడు.
ఆ తర్వాత మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. వీరి బంధానికి అడ్డుగా ఉన్న రెండో భార్య గోపికను అంతం చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఆమెను హతమార్చేందుకు తాంత్రిక మాంత్రికుడితో సుపారీ మాట్లాడుకోని క్షుద్రపూజలు చేయించాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించుకుంది. అయితే.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కోరుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు స్పందించకపోవడం గమనార్హం.
Updated Date - 2021-12-05T20:00:57+05:30 IST