రూ.9 వేల కోట్ల పంట నష్టం జీరో ఎలా అయింది?
ABN, First Publish Date - 2021-09-18T08:15:58+05:30
వరదల కారణంగా గతేడాది సుమారు రూ.9 వేల కోట్ల పంట నష్టం జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని..
- అదే చెప్తూ కేంద్రానికి మళ్లీ లేఖ రాశారా?
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- పంట నష్టం వ్యాజ్యంలో తీర్పు రిజర్వు
సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): వరదల కారణంగా గతేడాది సుమారు రూ.9 వేల కోట్ల పంట నష్టం జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని.. ఇప్పుడు ఆ నష్టం ఒక్కసారిగా జీరో ఎలా అయిందని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందమే రూ.188 కోట్ల మేర పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చాక.. అసలు నష్టం లేదని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. గతేడాది వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రానికి రాసిన లేఖల్లో ఉన్నది ప్రాథమిక అంచనా మాత్రమే అన్నారు. పంట నష్టంపై ఎలాంటి మదింపు జరగలేదని తెలిపారు.
పంట తక్కువగా వచ్చింది కానీ అది వరదల వల్లే అని చెప్పలేమని వాదించారు. కోర్టు స్పందిస్తూ... ‘దాదాపు రూ.9 వేల కోట్ల నష్టం జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలను కేంద్రం సమర్పించింది. కేంద్ర బృందం సైతం పంట నష్టం ఉన్నట్టు నిర్ధారించింది. నష్టం లేదని భావించినప్పుడు.. తప్పుగా అంచనా వేశామని కేంద్రానికి మళ్లీ లేఖ రాశారా?’ అని ఏజీని ప్రశ్నించింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్రావు వాదిస్తూ.. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్రం రూ.449 కోట్లను విడుదల చేసిందన్నారు. అంతకుముందు నిధులతో కలిపి మొత్తం రూ.977 కోట్లు రాష్ట్రం వద్ద ఉన్నాయని తెలిపారు. ఆ నిధులు కేవలం పంటనష్టం గురించి కాదని, కొవిడ్ నియంత్రణకు వాటిని వాడామని ఏజీ తెలిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదిస్తూ క్షేత్రస్థాయిలో మదింపు చేయకుండా నష్టం లేదని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది.
Updated Date - 2021-09-18T08:15:58+05:30 IST