ఐటీ శాఖకు హైకోర్టు అక్షింతలు!
ABN, First Publish Date - 2021-01-14T07:25:00+05:30
ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. సరైన ఆధారాలు చూపినా ఏదో ఒక మిషతో సీజ్ చేసిన రూ.5కోట్లు తిరిగి అప్పగించకపోవడం సరికాదంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే
పిటిషనర్కు 5కోట్లు వడ్డీతో చెల్లించాలి
కోర్టు ఖర్చుల కింద మరో 20 వేలివ్వాలి:బెంచి
హైదరాబాద్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. సరైన ఆధారాలు చూపినా ఏదో ఒక మిషతో సీజ్ చేసిన రూ.5కోట్లు తిరిగి అప్పగించకపోవడం సరికాదంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నగదు నిలుపుకోవడం ఐటీ చట్ట ప్రకారం నేరంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2020 మార్చి 31 తర్వాత లెక్కల్లో చూపాల్సిన దానికి ఊహాజనితమైన సందేహాలతో నిలిపి వేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-ఏను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. హైదరాబాద్ వెస్ట్జోన్ పోలీసు టాస్క్ఫోర్సు అధికారులు సీజ్ చేసి, ఐటీ అధికారులకు అప్పగించిన రూ.5కోట్ల నగదును సీజ్ చేసిన నాటినుంచి 12శాతం వడ్డీతో పిటిషనర్కు చెల్లించాలని తేల్చిచెప్పింది.
కోర్టు ఖర్చుల కింద పిటిషనర్కు రూ.20వేలు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. అమరనాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. గుజరాత్కు చెందిన మెక్టెక్ సంస్థ ఉద్యోగి విపుల్ కుమార్ పాటిల్ రూ. 5కోట్లు నగదు తరలిస్తుండగా, హైదరాబాద్ వెస్ట్జోన్ పోలీసులు 2019 ఆగస్టు 28న పట్టుకున్నారు. నగదుకు సరైన లెక్కలు చెప్పకపోవడంతో హవాలా సొమ్ముగా భావించి పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. విపుల్ కుమార్ తమ ఉద్యోగేనని, ఈ నగదు తమకే అప్పగించాలని మెక్టెక్ సంస్థ ఐటీ అధికారులను కోరింది. ఐటీ అధికారులు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది.
Updated Date - 2021-01-14T07:25:00+05:30 IST