అతి చేయొద్దు!
ABN, First Publish Date - 2021-10-29T08:17:15+05:30
గోదావరిపై నిర్మించిన ఆరు ప్రాజెక్టుల (సీతారామ, మొడికుంటవాగు, చౌటపల్లి హనుమంత రెడ్డి, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, చనకా కొరాటా)కు సాంకేతిక అనుమతి కోరుతూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక
- మీ అధికారాలకే పరిమితం కావాలి..
- డీపీఆర్లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపాలి
- విభజన చట్టంలో మీ అధికారాలు సుస్పష్టం..
- గోదావరి బోర్డు చైర్మన్కు తెలంగాణ లేఖ
- వరుస కొర్రీలు వేస్తుండడంపై మండిపాటు..
- ఏపీ ప్రలోభాలకు లొంగి ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై నిర్మించిన ఆరు ప్రాజెక్టుల (సీతారామ, మొడికుంటవాగు, చౌటపల్లి హనుమంత రెడ్డి, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, చనకా కొరాటా)కు సాంకేతిక అనుమతి కోరుతూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించామని, కాలయాపన లేకుండా వాటిని వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. డీపీఆర్లను పరిశీలించడానికి సీడబ్ల్యూసీలో పలు డైరెక్టరేట్లు ఉన్నాయని, వాటి బాధ్యతలను బోర్డు నిర్వర్తించలేదని తేల్చి చెప్పింది. డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపకుండా నెలన్నరగా వరుస కొర్రీలు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తనకున్న అధికారాలను మించి జీఆర్ఎంబీ వ్యవహరిస్తోందని మండిపడింది. ‘‘విభజన చట్టంలో బోర్డు అధికారాలు, విధులపై స్పష్టత ఇచ్చారు. ట్రైబ్యునల్ తీర్పునకు లోబడి, కేటాయించిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను కడుతున్నారా? ఆ మేరకే డీపీఆర్లు సమర్పించారా? తీర్పునకు విరుద్ధంగా ప్రతిపాదించారా? అన్న అంశాన్నే బోర్డు పరిశీలించాలి. దానికే పరిమితం కావాలి.
అంతే తప్ప.. డీపీఆర్లోని హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, నీటి లభ్యత, వ్యయం, కాస్ట్ ఎకనామిక్, డిజైన్ వంటి అంశాలపై వ్యాఖ్యానించే అధికారం బోర్డుకు లేదు. వాటిని పరిశీలించే బాధ్యత సీడబ్ల్యూసీదే. బోర్డులకు ఆ నైపుణ్యం లేదు’’ అని తప్పుబట్టింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్రావు గురువారం లేఖ రాశారు. గోదావరిపై నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెప్టెంబరు 6న డీపీఆర్లను తెలంగాణ సమర్పించిన విషయం తెలిసిందే. వీటిపై బోర్డు పలు కొర్రీలు వేస్తోంది. అయితే, ఈ కొర్రీల వెనక ఏపీ అధికారుల ప్రమేయం ఉందని, ఏపీ ప్రలోభాలకు లొంగే గోదావరి బోర్డు ఇబ్బందులు పెడుతోందని తెలంగాణ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే, బోర్డుల అధికారాలు, విధులపై ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏం చెప్పిందో పొందుపరుస్తూ లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ను కృష్ణా బోర్డుకు సమర్పించినప్పుడు.. సంబంధిత నైపుణ్యం తమకు లేదంటూ బోర్డు దానిని సీడబ్ల్యూసీకి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. చట్టంలోని అధికారాలు, బాధ్యతలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. గోదావరి నదీ వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం కేటాయించిన వాటా ఆధారంగానే డీపీఆర్లు రూపొందించామని, అపెక్ ్స కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా వాటిని పరిశీలించి, పంపించాలని బోర్డుకు సూచించారని గుర్తు చేసింది. సదరు డీపీఆర్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన, అపాయింటెడ్ డే (2014 జూన్ 2వ తేదీ కల్లా) పూర్తయిన ప్రాజెక్టులవేనని వివరించింది.
Updated Date - 2021-10-29T08:17:15+05:30 IST