ఆ ఆరు మండలాలు.. లేదా ఐదు పంచాయతీలైనా ఇవ్వండి
ABN, First Publish Date - 2021-01-31T08:48:41+05:30
రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ముంపు పేరుతో తెలంగాణలోని కొన్ని మండలాలను ఏపీలో విలీనం చేయడం అన్యాయమని మంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. భద్రాచలం అభివృద్దికి ఎంతో కీలకమైన ఆరు
ఏపీలో విలీనంతో అన్యాయం
కేటీఆర్కు రామయ్య కృప ఉండాలని కోరుకున్నా: శీనివా్సగౌడ్
భద్రాచలం/ఖమ్మం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ముంపు పేరుతో తెలంగాణలోని కొన్ని మండలాలను ఏపీలో విలీనం చేయడం అన్యాయమని మంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. భద్రాచలం అభివృద్దికి ఎంతో కీలకమైన ఆరు మండలాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని లేదా ఐదు పంచాయతీలైనా ఇవ్వాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. శనివారం భద్రాచలంలో ఎక్సైజ్ పోలీసు స్టేషన్ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం మునగకుండా చూడాల్సిన బాధ్యత ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ప్లాన్ సిద్ధమైందని, పర్యాటక శాఖ ద్వారా రూ.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించేందుకు తమ యువ నాయకుడు కేటీఆర్కు గొప్ప శక్తి ప్రసాదించాలని భద్రాద్రి రాముణ్ని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు భద్రాద్రి రామయ్యను ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
మునగాకు పొడి తయారీ కేంద్రం ప్రారంభం
మునగాకుకు డిమాండ్ పెరగడంతో భద్రాచలం ఐటీడీఏ రూ.4 లక్షలతో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లలో మునగాకు పొడి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గిరిజన యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శనివారం మంత్రులు సత్యవతి రాఽథోడ్, పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
Updated Date - 2021-01-31T08:48:41+05:30 IST