గెజిట్పై రంగంలోకి కేంద్రం!
ABN, First Publish Date - 2021-10-21T08:34:54+05:30
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కేంద్రం రంగంలోకి దిగుతోంది.
అమలుపై జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి సమీక్ష
కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో నేడు లేదా రేపు వర్చువల్ భేటీ
సమగ్ర వివరాలతో అధికార్లు సిద్ధం
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కేంద్రం రంగంలోకి దిగుతోంది. గురువారం లేదా శుక్రవారం కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ వర్చువల్ విధానంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్లు చంద్రశేఖర్ అయ్యర్, మహేంద్ర ప్రతా్పసింగ్లతో సమీక్ష జరపనున్నారు. జూలై 15న జారీ చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. షెడ్యూల్-2లో ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డుల ప్రత్యక్ష నియంత్రణలోకి రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక అడుగు ముందుకేసి.. 14న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోని కాంపోనెంట్లను బోర్డుల పరిధిలోకి తేవడానికి అంగీకారం తెలుపుతూ జీవో జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే తమ ప్రాజె క్టులనూ స్వాధీనం చేసుకోవాలని మెలిక పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ ఉత్తర్వులూ జారీ చేయలేదు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) జారీ చేసిన నిర్వహణ ప్రొటోకాల్పై అధ్యయనం కోరుతూ ఏడుగురు సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. నిర్వహణ ప్రొటోకాల్ తెలియకుండా బోర్డుల చేతికి ప్రాజెక్టులను అప్పగించలేమని, ప్రాజెక్టులు ఇస్తే ఏ ప్రాతిపదికన నడుపుతారో చెప్పాలని తెలంగాణ పట్టుబడుతోంది. గెజిట్ అమలు చేసే దిశగా తీసుకున్న చర్యలపై కేంద్రం ఆరా తీయనుండడంతో అధికారులు పూర్తి వివరాలతో సిద్ధమయ్యారు.
Updated Date - 2021-10-21T08:34:54+05:30 IST