గులాబీ జెండా పోవాలి.. నీలి జెండా రావాలి
ABN, First Publish Date - 2021-08-01T08:38:45+05:30
గులాబీ జెండా పోవాలి.. నీలి జెండా రావాలి
బహుజనులకు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలి
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతోసీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్లు దోచుకున్నారు
ఆ డబ్బే ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సుభా్షనగర్ (నిజామాబాద్)/ఉప్పల్/హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘‘మన పిల్లల బతుకులు మారాలంటే బహుజన రాజ్య స్థాపనే అంతిమ లక్ష్యం కావాలి. రాష్ట్రంలో గులాబీ జెండా పోయి, నీలి జెండా రావాలి. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఐక్యంగా పోరాడాలి’’ అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్, హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో జరిగిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బహుజన వర్గాల అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదు. వారిని కావాలనే చదువుకు దూరం చేస్తున్నారు. అందుకోసమే విద్యా సంస్థల్లో నియామకాలు చేపట్టడం లేదు. ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనే ఎందుకు వచ్చిందో చెప్పాలి.
దళితులను పావులుగా వాడుకునేందుకే ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంపై ఖర్చుచేసే నిధులతో చదువులకు దూరమైన పేద విద్యార్థుల కోసం పెట్టవచ్చు. ఆ నిధులతో ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో సీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్లు దోచుకున్నారని, ఆ పథకాలలో కమీషన్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ఎవరెస్టును అధిరోహించిన మాలావత్ పూర్ణకు కామారెడ్డిలో 300 గజాల స్థలం ఇచ్చి, క్రీడాకారిణి సింధూకు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో స్థలం కేటాయించడం వివక్షకు నిదర్శనం కాదా? అని నిలదీశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నన్ను కలిసిన చిరుద్యోగులపై సస్పెన్షనా?
తనను గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డలను ఏం చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్న కరీంనగర్లో తనను కలిశారంటూ ఇద్దరు బహుజన చిరుద్యోగులపై కక్షగట్టి సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని శనివారం ఆయన ట్వీట్ చేశారు.
Updated Date - 2021-08-01T08:38:45+05:30 IST