ఒకే వర్సిటీలో అన్ని కోర్సులు!
ABN, First Publish Date - 2021-07-21T08:48:42+05:30
ఒకే యూనివర్సిటీలో అన్ని కోర్సులనూ ప్రవేశపెట్టాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని పేర్కొంది...
- కచ్చితంగా అమలు చేయాల్సిందే.. విశ్వవిద్యాలయాలకు యూజీసీ లేఖ
- రాష్ట్రంలో ప్రస్తుతం అసాధ్యమే..?
- వర్సిటీల్లో ఖాళీల భర్తీకే ఇబ్బందులు
- ఇక అన్ని కోర్సులు ప్రవేశపెట్టడం కష్టమే!
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఒకే యూనివర్సిటీలో అన్ని కోర్సులనూ ప్రవేశపెట్టాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని పేర్కొంది. అన్ని యూనివర్సిటీలూ అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ డి.పి.సింగ్ తాజాగా వర్సిటీలకు లేఖ రాశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని యూనివర్సిటీలు పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్కు సంబంధించిన వర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు, అగ్రికల్చర్ వర్సిటీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన కోర్సులే ఉన్నాయి. ఇలా వివిధ సబ్జెక్టులకు వేర్వేరు యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే జాతీయ విద్యా విధానంలో భాగంగా ఒక్కో యూనివర్సిటీలో అన్ని రంగాలకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అంటే ఒక యూనివర్సిటీలో ఐఐటీ వంటి ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా సైన్స్, ఆర్ట్స్, లా, వ్యవసాయం వంటి వివిధ రంగాలకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇలా ఒకే వర్సిటీలో అన్ని రంగాల కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా సమగ్ర విద్యా విధానం అందుబాటులోకి వస్తుందని, వ్యక్తిగతంగా విద్యార్థులకు మేలు జరగడమే కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడుతుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సైన్స్, సోషల్ సైన్స్, టెక్నికల్, ఒకేషనల్ వంటి రంగాల కోర్సులను ఒకే యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టినట్టు అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని యూనివర్సిటీలు తగు చర్యల్ని తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక యూనివర్సిటీలో అన్ని కోర్సులనూ ప్రవేశపెట్టడం అంత సులువైన విషయం కాదని విద్యాశాఖ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. వర్సిటీల్లో ఉన్న కోర్సులను కొనసాగించడానికే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. నిధుల కొరతతో పాటు బోధన, బోధనేతర సిబ్బం ది కొరత కూడా తీవ్రంగా ఉంది. యూనివర్సిటీ స్థాయిలో ఒక కోర్సును ప్రవేశపెట్టాలంటే ఒక ప్రొఫెసర్ పోస్టుతో పాటు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరం ఉంటుంది. అలాగే ఒక్కో కోర్సులో సుమారు 10-15 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ లెక్కన ఏదైనా కోర్సును ప్రారంభించాలంటే కనీసం 100-120 మంది బోధనా సిబ్బంది అవసరం ఉంటుంది. అలాగే బోధనేతర సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు వర్సిటీల్లో కొత్త భవనాలు, ఇతర మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉం టుంది. ఇలా అన్ని కోర్సులను ప్రవేశపెట్టడానికి ఒక్కో వర్సిటీకి కనీసం రూ.200 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అన్ని రకాల కోర్సులను పెట్టడం అసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు.
Updated Date - 2021-07-21T08:48:42+05:30 IST