కేసీఆర్కు ధైర్యం లేకనే.. శిఖండిలను అడ్డం పెట్టుకుని కొట్లాడుతున్నారు
ABN, First Publish Date - 2021-10-28T09:04:35+05:30
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలోని కోటి కుటుంబాలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న కొట్లాట అని ...
విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్న టీఆర్ఎస్: ఈటల
హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్/కమలాపూర్, అక్టోబరు 27: హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలోని కోటి కుటుంబాలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న కొట్లాట అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ మండలంలోని చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి గ్రామాల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్కు ధైర్యం లేక శిఖండిలను అడ్డం పెట్టుకుని కొట్లాడుతున్నారని అన్నారు. గులాబీ జెండాకు అందరూ ఓనర్లమని కొట్లాడితేనే హరీశ్కు మంత్రిపదవి వచ్చిందని చెప్పారు. పదవుల కోసం పెదవులు మూసిండు కాబట్టే అల్లుడు దగ్గరయ్యిండని, తనను దూరం చేశారని ఆరోపించారు. వరి వేయద్దని అంటున్నారని, పూటకో మాటమాట్లాడే కేసీఆర్ అహంకారాన్ని దించాలన్నారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ డబ్బును నమ్ముకుంటే తమ పార్టీ ప్రజలను నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. హుజూరాబాద్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నఖిలీ లేఖలను సృష్టిస్తూ.. నమస్తే తెలంగాణ పత్రికలో రాయిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలారా వరి కావాలా? ఉరి కావాలా? వరి కావాలంటే బీజేపీకి, ఉరి కావాలంటే టీఆర్ఎ్సకు ఓటు వేయాలన్నారు. వరి వేస్తే సీడ్ దుకాణాలను సీజ్ చేస్తామని కలెక్టర్లు బెదిరించడం సిగ్గుపడే విషయమన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని, ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆయనను శాశ్వతంగా పదవి నుంచి దించేయాలని విజయశాంతి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.
Updated Date - 2021-10-28T09:04:35+05:30 IST