డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ఎప్పుడు..?
ABN, First Publish Date - 2021-10-21T10:10:26+05:30
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ఎప్పుడు..?
పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, జీహెచ్ఎంసీ, అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాలు ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయని, వాటిని లబ్ధిదారులకు కేటాయుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జూలై 31 నాటికి లక్షా 87 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో కేవలం 12,656 గృహాలను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాదాపు 88 శాతం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సృజన్కుమార్ వాదనలు వినిపిస్తూ... లబ్ధిదారులకు గృహాలు కేటాయించేందుకు నిర్ణీత గడువు విధించాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ తెలియజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదాపడింది.
Updated Date - 2021-10-21T10:10:26+05:30 IST