పేర్లు చెప్పొద్దు.. పైసలు ఇచ్చేస్తాం
ABN, First Publish Date - 2021-11-30T09:15:13+05:30
‘‘బాబ్బాబూ నీకివ్వాల్సిన డబ్బులు అణా పైసాతో సహా చెల్లిస్తాం.
- ఉద్దెర డబ్బులు ఇవ్వకుంటే వైన్షాపు ముందు..
- ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని నిర్వాహకుల హెచ్చరిక
- బాకీ చెల్లిస్తామంటూ మందుబాబుల వేడుకోలు
చౌటుప్పల్ రూరల్, నవంబరు 29: ‘‘బాబ్బాబూ నీకివ్వాల్సిన డబ్బులు అణా పైసాతో సహా చెల్లిస్తాం. దయచేసి వైన్ షాపు ముందు మా పేర్లు రాసి పరువు తీయొద్దు’’ అని మద్యం దుకాణంలో ఉద్దెర మందు తీసుకున్న మందుబాబులు వేడుకుంటున్నారు. తమకు బాకీ పడిన వారి పేర్లను ఫ్లెక్సీలో రాసి, వైన్ షాపు ముందు పెడతానని నిర్వాహకులు హెచ్చరించడంతో.. మందుబాబులు ఇలా దిగివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని రామలింగేశ్వర వైన్స్ నిర్వాహకులు గ్రామంలో పలుకుబడి కలిగిన పలువురు వ్యక్తులు, మందుబాబులకు రూ.8 లక్షల విలువైన మద్యం ఉద్దెర ఇచ్చారు. ఈ నెల 30తో ఆ షాపు టెండర్ గడువు ముగుస్తోంది. డిసెంబరు 1 నుంచి ఆ దుకాణం మరొకరి చేతుల్లోకి వెళ్లనుంది. ఎలాగూ వైన్ షాపు టెండర్ పాత వారికి రాలేదు కదా అని మందుబాబులు ఉద్దెర డబ్బులు చెల్లించలేదు. షాపు నిర్వాహకులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో విసుగుచెందిన యాజమాన్యం వైన్స్ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఈ నెల 29వ తేదీ 5గంటల లోపు డబ్బులు చెల్లించాలని, లేకపోతే బాకీ పడిన వారి పేర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం తెలుసుకున్న మందుబాబులు సోమవారం రాత్రి వరకు వైన్ షాపు యజమానులకు ఫోన్లు చేశారు. డబ్బులు చెల్లిస్తామని, పేర్లు ప్రచురించవద్దని వేడుకున్నారు. సోమవారం సాయంత్రం గడువు పెట్టడంతో ఒక్క రోజులోనే రూ.2లక్షలు వసూలయ్యాయి. మిగతావారు మంగళ, బుధవారం చెల్లిస్తామని బ్రతిమిలాడారు.
Updated Date - 2021-11-30T09:15:13+05:30 IST