నేడు రాష్ట్రంలో పంపిణీ బంద్
ABN, First Publish Date - 2021-04-18T09:03:20+05:30
రాష్ట్రంలో కొవిడ్ టీకా నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆదివారం పంపిణీని నిలిపివేశారు.
- 3 వేల డోసులే ఉండడంతో నిలిపివేత
- జిల్లాల వైద్యాధికారులకు సమాచారం
- కేంద్రం నుంచి సరఫరా కాని వ్యాక్సిన్
- 2.7 లక్షల డోసులు కోరిన ప్రభుత్వం
- నేటి రాత్రికి చేరుకునే అవకాశం
- కోఠి డీహెచ్ కార్యాలయం వద్ద ఆందోళన
హైదరాబాద్, మంగళ్హాట్, బేగంపేట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ టీకా నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆదివారం పంపిణీని నిలిపివేశారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు శనివారం అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా టెస్టులు యథావిధిగా.. లక్ష్యం మేరకు నిర్వహించాలని ఆదేశించారు. 3 వేల డోసులే ఉన్నందున వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం 2.7 లక్షల డోసులు పంపుతామని చెప్పినప్పటికీ.. అవి చేరలేదు. అయితే ఆదివారం రాత్రి వరకు పంపుతామని కేంద్రం సమాచారం ఇచ్చింది. కాగా, శనివారం చాలా కేంద్రాల్లో టీకా నిల్వలు లేవని వైద్య సిబ్బంది చెప్పడంతో వ్యాక్సిన్ కోసం వచ్చినవారు వెనుదిరిగారు. మరోవైపు వైద్య శాఖ బులెటిన్ ప్రకారం శుక్రవారం రికార్డు స్థాయిలో 1,61,406 మంది తొలి డోసు తీసుకున్నారు. 13,833 మంది రెండో డోసు వేయించుకున్నారు.
ఎంతమంది వచ్చినా.. వందమందికే టీకా
టీకాల్లేవని చెప్పడంతో.. హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పంపిణీ కేంద్రం వద్ద శనివారం వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఆందోళన చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ను సరఫరా చేసే ప్రధాన సెంటర్ ఉన్న ప్రాంతానికి ఈ కార్యాలయం కూతవేటు దూరంలో ఉంది. కాగా, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కోఠిలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ పేరుతో వాటిలోకి సామాన్యులను రానివ్వలేదు. ఓ ఉన్నతాధికారి సిఫారసు చేస్తే తప్ప సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ వేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వారం క్రితం మరో సెంటర్ ఏర్పాటు చేసి వివిధ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి టీకా ఇస్తున్నారు. అయితే, శనివారం వీఐపీ, వీవీఐపీ సెంటర్ను తరలించారు.
మరోవైపు నగరంలోని పలుచోట్ల నుంచి వందల మంది చేరుకోగా.. ఉదయం 9 గంటలకే 95 మందికి టోకెన్లు ఇచ్చారు. తర్వాత వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారు. వివిధ శాఖల సిబ్బంది, వృద్ధులు, మహిళలు, వికలాంగులు మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వాగ్వాదం అనంతరం అధికారులు టోకెన్లు ఉన్నవారిని లోపలికి పిలిచి తలుపులు మూసివేశారు. చేసేదిలేక టోకెన్లు లేనివారు వెనుదిరిగారు. కేవలం 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. ‘వీఐపీలకు మాత్రమే’ అన్నట్లు హడావుడి చేసిన కోఠి వ్యాక్సినేషన్ సెంటర్ అధికారులు, కనీస సమాచారం లేకుండానే సెంటర్ను తరలించడం, మరో సెంటర్లో డోసులు లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిల్వలు చూసుకోక పోవడంతో బేగంపేటలోని పాటిగడ్డ మోడల్ మార్కెట్ వద్ద ఉన్న ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.
Updated Date - 2021-04-18T09:03:20+05:30 IST