బండి సంజయ్వి దొంగ మాటలు
ABN, First Publish Date - 2021-10-30T05:14:52+05:30
బండి సంజయ్వి దొంగ మాటలు
బీజేపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు..
ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య
వరంగల్ టౌన్, అక్టోబరు 29: దేశ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టే రోజు ముందుందని, దొంగే దొంగా దొంగా అన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలుంటున్నాయని భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్యలు ఆరోపించారు. వరంగల్లోని రత్న హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని ఆశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సబ్సిడీపై విత్తనాలు, గిట్టుబాటు ధర, ఎరువులు ఇస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందన్నారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడనే భరోసా రైతాంగంలో ఉందన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చినందుకు ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
వడ్లను కొనబోమని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై పిడుగులాంటి వార్తను వేసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేంద్రమంత్రికి స్వయంగా విజ్ఞప్తి చేసినా కేంద్రమే పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. అయినా సీఎం ప్రతీ గింజను కొనుగోలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ దొంగ దీక్షలు చేస్తున్నాడని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం ఆనాడే పత్తి వేసుకోవాలని సూచించారని, ఇప్పుడు మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతోందన్నారు. రాజకీయ పార్టీలకు అతీంగా రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, బీజేపీ వాళ్లు రైతుబంధు, రైతు బీమా పథకాన్ని తీసుకోవడం లేదాని ప్రశ్నించారు. సమావేశంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర గొర్లపెంపకందార్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:14:52+05:30 IST