నంబర్ వన్ దిశగా తెలంగాణ అడుగులు.. : సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2021-08-15T16:48:30+05:30
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కోండ కోట వేదికగా ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్ సిటీ : గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలో రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కోండ కోట వేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోందని సీఎం తెలిపారు.
నాణ్యమైనదనే పేరుంది కనుక..
‘ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది. 2013-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరిపంట సాగయింది. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణం లో పత్తి పంట సాగయింది. 31 లక్షల 60 వేల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. పత్తి సాగులో తెలంగాణా దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో తెలంగాణా పత్తికి చాలా నాణ్యమైనదనే పేరుంది కనుక మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉండటం గమనార్హం’ అని కేసీఆర్ అన్నారు.
Updated Date - 2021-08-15T16:48:30+05:30 IST