ఉద్యమకారులను స్వేఛ్చగా పనిచేసుకోనివ్వాలి: హరగోపాల్
ABN, First Publish Date - 2021-07-10T08:35:13+05:30
విరసం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తేయడం ఒక్కటే సరిపోదని, రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజా ఉద్యమకారులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని
హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విరసం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తేయడం ఒక్కటే సరిపోదని, రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజా ఉద్యమకారులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలను మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలుగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. టీఆర్ఎస్ రాజకీయాలను అనుసరించడం ఒక్కటే రాజకీయ స్వేచ్ఛకాదని వ్యాఖ్యానించారు. ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేసిన సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా హరగోపాల్ మాట్లాడుతూ.. గిరిజన హక్కుల సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన స్టాన్స్వామి మరణానికి భారత న్యాయ వ్యవస్థతో పాటు మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ.. కాలంచెల్లిన ప్రజాభద్రతా చట్టం, యూఏపీఏ యాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేత ముమ్మాటికీ ప్రజా విజయమేనని అన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు సురేశ్, జ్యోతి, పద్మ కుమారి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-10T08:35:13+05:30 IST