తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల రుణాలు
ABN, First Publish Date - 2021-12-03T08:09:46+05:30
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్ఫసీ),
కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్ఫసీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) రుణాలు అందించాయని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం సమాధానమిచ్చారు. పన్నెండేళ్లలో తిరిగి చెల్లించాలన్న షరతుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి 9.2-11శాతం వడ్డీతో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏడాదికి 10.65-11 శాతం వడ్డీతో పీఎ్ఫసీ రుణాన్ని మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం రుణాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 15 నుంచి, పాలమూరు రుణాన్ని 2024 అక్టోబరు 15 నుంచి తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. కాళేశ్వరానికి ఏటా 10.9 శాతం వడ్డీతో ఆర్ఈసీ రుణాన్ని మంజూరు చేయ గా... 11 శాతం వడ్డీతో ఇందిరమ్మ వరద కాలువ, జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల, పీవీ నరసింహా రావు కంతనపల్లి ప్రాజెక్టుకు రుణాలను మంజూరు చేసినట్టు తెలిపారు.
గోదావరి-కావేరి డీపీఆర్ పూర్తి
గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా కొన్ని కాంపొనెంట్లకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన పూర్తయిందని, మరిన్ని కాంపొనెంట్లకు సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ పూర్తయిందని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గోదావరి (ఇచ్చంపల్లి)-కృష్ణా(పులిచింతల), గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ), కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా, కృష్ణా (శ్రీశైలం)-పెన్నా లింక్లకు సాధ్యాసాధ్యాల నివేదిక పూర్తయిందని తెలిపారు. సాధ్యాసాధ్యాల నివేదిక, గోదావరి (ఇచ్చంపల్లి)-కృష్ణా (నాగార్జున సాగర్), కృష్ణా(నాగార్జునసాగర్)-పెన్నా (సోమశిల),పెన్నా(సోమశిల)-కావేరి లింక్లకు డీపీఆర్ పూర్తయిందన్నారు.
Updated Date - 2021-12-03T08:09:46+05:30 IST