హుజూరాబాద్ ఎన్నికను రద్దు చేయండి
ABN, First Publish Date - 2021-10-29T08:42:12+05:30
హుజూరాబాద్లో ఒక్కో ఓటుకు రూ.10వేల వరకూ పంపిణీ చేస్తున్నారు. నగదుతోపాటు చీరలు, వంట పాత్రలు, స్పోర్ట్స్ కిట్లు, గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు.. ఇలా ఓటర్లను తీవ్ర
- ఓటుకు రూ.10వేల చొప్పు పంపిణీ.. పోలీసుల ప్రేక్షక పాత్ర
- సీఈవోను తప్పించండి.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్లో ఒక్కో ఓటుకు రూ.10వేల వరకూ పంపిణీ చేస్తున్నారు. నగదుతోపాటు చీరలు, వంట పాత్రలు, స్పోర్ట్స్ కిట్లు, గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు.. ఇలా ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రలోభ పెడుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురువుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను వెంటనే రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్రపాండేను గురువారం ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, నేతలు కుసుమ్ కుమార్, వేణుగోపాల్రావు తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రలోభపెడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పెద్ద ఎత్తున డబ్బు పంచుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాన, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
మంత్రి హరీశ్రావు స్వయంగా రంగంలోకి దిగి.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఈవో శశాంక్ గోయల్తోపాటు ఎన్నికల పరిశీలకులు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఈవోతోపాటు రాష్ట్ర యంత్రాగాన్ని పక్కనబెట్టి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని కోరారు. అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్లో రాజకీయ వ్యాపారం జరుగుతోందని అన్నారు. ఓటు వేయకపోతే పెన్షన్లు రావని టీఆర్ఎస్ నేతలు బెదిస్తున్నారని తెలిపారు. తమ ఫిర్యాదుపై కమిషనర్లు సానుకూలంగా స్పందించారని, విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
Updated Date - 2021-10-29T08:42:12+05:30 IST