కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న కేసీఆర్: సంజయ్
ABN, First Publish Date - 2021-10-29T08:27:27+05:30
సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘రైతులకు కావాల్సింది ధాన్యం కొనుగోళ్లు.
సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘రైతులకు కావాల్సింది ధాన్యం కొనుగోళ్లు. ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్గా ఇస్తరా? రా రైస్గా ఇస్తరా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ అంశంతో రైతులకు ఏం సంబంధం? ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. బాయిల్డ్ రైస్ బదులు రా రైస్ ఇవ్వాలని మాత్రమే కోరింది. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటుంది’’ అని స్పష్టం చేశారు. వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష చేశారు. ఈ సందర్భంగా, ఆ తర్వాత విలేకరులతో ఇష్టాగోష్ఠిగా సంజయ్ మాట్లాడారు. రైతుల పేరు చెప్పి కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని.. ఆయన పెద్ద అబద్ధాలకోరు అని ఆరోపించారు. తాము ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నిస్తే, ఉప్పుడు బియ్యం వద్దంటూ కేంద్రం గత నెల 30న రాసిన లేఖను ఇప్పుడు బయట పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసేది కేంద్రమేనని, కేసీఆర్ చేసేది బ్రోకర్ పాత్ర మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో ‘వరి బంద్’ పథకం అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని, రైతుల ఉసురు ఆయనకు తగులుతుందని, ఆయనకు మద్యం అమ్మకాలపై ప్రేమే ఎక్కువని విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం లేఖ రాస్తే, కేంద్రాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ కొంతమంది మిల్లర్లు, టీఆర్ఎస్ నాయకులు భారీ స్కాంకు పాల్పడ్డారని, దానిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. హుజూరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసేలా ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది కోడ్ ఉల్లంఘన అని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి కిసాన్మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డిని సస్పెండ్ చేసే దాకా పోరాటం ఆపబోమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.
Updated Date - 2021-10-29T08:27:27+05:30 IST