కాళేశ్వరం పేరుతో కేసీఆర్ మరోసారి మోసం: బండి సంజయ్
ABN, First Publish Date - 2021-01-20T01:37:49+05:30
కాళేశ్వరం పేరుతో ప్రజలను మరోసారి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు
హైదరాబాద్: కాళేశ్వరం పేరుతో ప్రజలను మరోసారి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రెస్నోట్ విడుదల చేశారు. ‘కేసీఆర్ ఒక ఫెయిలూర్ ముఖ్యమంత్రి. అవినీతి ముఖ్యమంత్రి.కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఫెయిల్ అయ్యింది. కేసీఆర్ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని మరల్చలేరు. కేసీఆర్ పతనం ప్రారంభమైంది. గత రెండేళ్ళుగా ఒక్క ఎకరానికి కూడా ఈ ప్రాజెక్టు కింద నీరు ఇవ్వలేదు. ఎత్తిపోతల విషయంలో గత ఏడాది కూడా డ్రామాలాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం స్పాట్గా మారుతుందేమో కాని .. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదు’ అన్నారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్లో కేవలం 17.20 లక్షల ఎకరాలు అని మాత్రమే ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీరిస్తా అని తెలంగాణ ప్రజలను వంచించారు. లక్ష కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు 3వ టీఎంసీ అంట. కొత్త ముచ్చట చెబుతున్నారు. కాళేశ్వరం డీపీఆర్ కేంద్రానికి ఇస్తే కేసీఆర్ బండారం బయట పడుతుందని భయపడుతున్నారు. డీపీఆర్లను కేంద్రం ముందు పెట్టాలి. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు మేం సిద్ధం. కాళేశ్వరం ప్రాజెక్టులో పూజలు చేస్తే పాపాలు పోవు. ప్రజలెవ్వరూ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనను ప్రజలు పట్టించుకోలేదు. ఎస్ఆర్ఎస్పీ కింద ఆయకట్టు వర్షం వల్ల వచ్చిందే.. కాళేశ్వరం వల్ల కాదు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-01-20T01:37:49+05:30 IST