కన్నుల పండువగా తెప్పోత్సవం
ABN, First Publish Date - 2021-10-17T05:08:33+05:30
కన్నుల పండువగా తెప్పోత్సవం
ఘనంగా భద్రకాళి - భద్రేశ్వరుల కళ్యాణం
హనుమకొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సుప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో శుక్రవారం విజయదశమి తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం అమ్మవారికి సామ్రాజ్యపట్టాభిషేకం జరిపిన తర్వాత చక్రతీర్థోత్సవం (చక్రస్నానం) నిర్వహించారు. ద్వజారోహణ చేశారు. సాయం త్రం అమ్మవారికి భద్రకాళి చెరువులో జలక్రీడోత్సవం (తెప్పోత్సవం) వైభవంగా నిర్వహించారు. 50వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శమీ వృక్షానికి పూజ అనంతరం భక్తులకు జమ్మి ఆకులను అందచేయగా పరస్పరం పంచుకున్నారు. ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెప్పోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యు డు బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీ మ్, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. తెప్పోత్సవానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లికి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆలయ ఈవో శేషుభారతి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అత్యంత సుందరంగా తయారు చేసిన హంస వాహనంలో వేలాది మంది భక్తజన సందోహం మధ్య తెప్పోత్సవం నయనానందకరంగా జరిగింది. తెప్సోత్సవానికి హాజరైన మం త్రి, ఇతర ప్రముఖులకు తెప్సోత్సవ ఉభయదాతలు గాయత్రీ గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర శాలువాలతో సత్కరించారు. తెప్సోత్స వం అనంతరం ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణు లు మల్లావజ్జుల రామక్రిష్ణశర్మ భద్రకాళి ఆల య స్థల పురాణంపై రాసిన గ్రంథాన్ని వినయ్భాస్కర్ ఆవిష్కరించారు. రామకృష్ణ శర్మను స్వర్ణకంకణంతో సత్కరించారు. ఉత్సవాల సందర్భంగా విద్యారణ్య ఆర్షధర్మ రక్షణ సంస్థ సౌజన్యంతో నాదోపాసన, సారస్వతోపాసన శీర్షికల కింద నిర్వహించిన సంగీత, సంస్కృత, సాహి త్య, శాస్త్రీయ సంగీత ప్రతిభా పాటవ పోటీల విజేతలకు మంత్రి ఎర్రబెల్లి నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను ప్రదానం చేశారు.
కళ్యాణం
శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ క్రతువును తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవంతో భద్రకాళీదేవి శరన్నవరాత్రుల ఉత్సవం పరిసమాప్తి అయింది.
మాడవీధులకు శంకుస్థాపన
హనుమకొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ భద్రకాళి ఆలయం గుడి చుట్టూరా నిర్మించనున్న మాడవీధులకు శుక్రవారం విజయదశమి రోజున చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగర ప్రజల 50 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు కృషి, కుడా అధికారుల సహకారం, ఆంధ్రజ్యోతి వరుస కథనాల ఫలితంతో కదలిక వచ్చి ఎట్టకేలకు మాడవీధుల నిర్మాణానికి ఒక రూపం వచ్చింది. రూ.30కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మాడవీధులను నిర్మించనున్నారు. ఇందులో రూ.5కోట్లను కుడా సమకూరుస్తుంది. వరంగల్ నగర పాలక సంస్థ రూ.3కోట్లను అందచేస్తుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుకు వినయ్భాస్కర్ ప్రతిపాదనలు పంపారు. మాడవీధుల నిర్మాణంలో తమ వంతు సహకారం అందించేందుకు నగరంలోని పలువురు ప్రముఖులు, దాతలు, భక్తులు సంసిద్ధంగా ఉన్నారు.
Updated Date - 2021-10-17T05:08:33+05:30 IST